మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (08:41 IST)

కేరళలో సీన్ రివర్స్ : కొత్తగా 19 కరోనా కేసులు

కేరళ రాష్ట్రంలో సీన్ రివర్స్ అయింది. కరోనా కట్టడి చర్యల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా ఉంటూ వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంపై కరోనా మళ్లీ పంజా విసిరింది. 
 
మంగళవారం ఒక్కరోజే కేరళలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క కన్నూర్‌లోనే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పాలక్కడ్‌లో నాలుగు, కాసర్‌గోడ్‌లో మూడు, మలప్పురం, కొల్లాంలో ఒక్కో కేసు నమోదైంది. 
 
వాస్తవానికి గత కొన్ని రోజులుగా కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో.. కేరళలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా భావించారు. అయితే.. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
అయితే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి ట్రావెల్ హిస్టరీ ఉందని అధికారులు తేల్చారు. పాజిటివ్ కేసులు పెరగడంపై సీఎం పినరయ్ విజయన్ స్పందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మార్చి 12 నుంచి ఏప్రిల్ 21 మధ్య కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్టులు చేశామని ఆయన ప్రకటించారు.
 
మరోవైపు, కేరళలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుండి పెరగడానికి సోమవారం ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపే కారణంగా తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలించడంతో ఆయా ప్రాంతాల్లో జన సంచారం పెరిగింది. క్షౌరశాలలు, రెస్టారెంట్లు, బుక్ షాపులు, సరి-బేసి విధానంలో ప్రైవేట్ వాహనాలకు అనుమతినివ్వడంతో కొన్ని గంటల్లోనే ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. పాజిటివ్ కేసులు పెరగడానికి ఇదొక కారణంగా తెలిసింది.