గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (10:03 IST)

దేశంలో కరోనా తాజా అబ్డేట్స్... తెలంగాణాలో ఎన్ని కేసులు?

దేశంలో మరో 38 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు... గడిచిన 24 గంటల్లో 38,617 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,12,908 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 44,739 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 474 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,993 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 83,35,110 మంది కోలుకున్నారు. 4,46,805 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 12,74,80,186 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్క మంగళవారమే 9,37,279 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,607 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,45,293 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,415 కి చేరింది. 
 
ప్రస్తుతం 13,068 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,710 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 76 కేసులు నిర్ధారణ అయ్యాయి.