1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (10:10 IST)

హమ్మయ్యా... శాంతించిన కరోనా ... 3 లక్షలకు దిగువకు...

హమ్మయ్యా.. దేశంలో కరోనా వైరస్ క్రమంగా శాంతిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకు మూడు లక్షల నుంచి దాదాపు 4 లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూ ప్రజలు, పాలకుల వెన్నులో వణుకుపుట్టించాయి. అయితే, సోమవారం కొత్త కేసుల నమోదు 3 లక్షలకు దిగువకు చేరుకున్నాయి. 
 
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... ఆదివారం 3,78,741 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,49,65,463కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 4,106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,74,390కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076  మంది కోలుకున్నారు. 35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 31,64,23,658 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,73,515 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇకపోతే, దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.