1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (10:34 IST)

కరోనా ఎఫెక్ట్.. డిసెంబర్ 31 వరకు పాఠశాలలు బంద్.. ఎక్కడ?

కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కానీ అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అయినా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకిన దాఖలాలు వున్నాయి. 
 
దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ మహమ్మారి మధ్య పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో 80 మంది ఉపాధ్యాయులకు కరోనా బారినపడ్డారు. అలాగే ఏపీలో 829 మంది ఉపాధ్యాయులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9-12 తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఒడిశా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా వుండే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్న తరుణంలో.. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరవకూడదని ఒడిశా సర్కారు నిర్ణయించింది. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో సెకండ్‌ వేవ్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేసినా పరీక్షలు, మూల్యాకనం, పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. 
 
పాఠశాలల్లో ఆన్‌లైన్‌, దూర విద్య తరగతులు కొనసాగుతాయని, కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఆన్‌లైన్‌ బోధన, టెలీకౌన్సెలింగ్‌ ఉంటాయని, బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావాల్సి ఉంటుందని చెప్పింది.