శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (16:27 IST)

టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆప్ఘనిస్థాన్..

ప్రపంచ క్రికెట్‌లో పని కూన అయిన ఆప్ఘనిస్థాన్ ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ధీటుగా ఆడి ఔరా అనిపించింది. ఒకపక్క వన్డేలు, మరో పక్క టీ20ల్లో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ దేశం గతేడాది టెస్ట్ హోదాను పొందింది. అలాగే మొదటి మ్యాచ్‌ని ప్రపంచ నెం.1 జట్టు భారత్‌పై ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడింది. 
 
కాగా ఉపఖండ జట్టు ఆప్ఘనిస్థాన్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని న‌మోదు చేసింది. ఆడిన రెండో టెస్టులోనే గెలుపొందిన జ‌ట్టుగా ఘ‌న‌త సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. ఛేదనలో రహ్మత్‌షా(76), ఇషానుల్హా (65 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో అఫ్గాన్ అలవోకగా విజయం సాధించింది.
 
తాజాగా ఐర్లాండ్‌తో టెస్టులో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన త‌ర్వాత 25వ(ఇంగ్లాండ్‌తో) మ్యాచ్‌లో టీమిండియా తొలి విజ‌యాన్ని అందుకుంది. ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మరోసారి గేమ్ చేంజర్ అనిపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లతో చెలరేగిన రషీద్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో విజృంభించి ఐర్లాండ్‌ను కట్టడి చేసాడు.
 
రహ్మత్‌షా, ఇషానుల్హా 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. 
 
ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బాల్‌బిర్నీ(82), కెవిన్ ఒబ్రైన్(56) మెరుగైన ప్రదర్శన చేయడంతో 288 పరుగులు చేసింది. ఏదైమైనా ఆడిన రెండో టెస్టులోనే విజయం చవిచూసిందంటే రానున్న రోజుల్లో మిగతా జట్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదూ..