గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (19:31 IST)

నేనూ మనిషినే కదయ్యా... చేసిన తప్పుకు క్షమాపణలు : ఆసీస్ కెప్టెన్ పైన్

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల పట్ల ఆసీస్ క్రికెటర్లు అనుచితంగా ప్రవర్తించారు. ముఖ్యంగా, ఆసీస్ జట్టు కెప్టెన్ పైన్ భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ఆయన ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నేనూ మనిషినే... చేసిన తప్పుకు క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పాడు. 
 
కాగా, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్వితీయ ఆటతీరు కనబరిచిన అశ్విన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. వికెట్లకు అడ్డుగోడలా నిలిచిన అశ్విన్ జట్టు పరాజయం కాకుండా కాపాడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.
 
దీంతో ఆసీస్ కెప్టెన్ పైన్ పలుమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫీల్డింగులో మూడు క్యాచ్‌లు వదిలేయడంతో మరింత చిరాకు చెందాడు. అశ్విన్ క్రీజులో పాతుకుపోవడంతో ఆ చిరాకును అతడిపై ప్రదర్శించాడు. నోరు పారేసుకున్నాడు. 
 
ఇది కాస్తా స్టంప్ మైక్‌లో రికార్డయింది. నేడు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో పైన్ మాట్లాడుతూ.. నిన్నటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 'నేనూ మనిషినే. చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.
 
'ఈ జట్టును నడిపిస్తున్న తీరును చూసి నన్ను నేను గర్విస్తాను. కానీ నిన్న నా ప్రవర్తన ఏమంత బాగోలేదు’’ అని చెప్పుకొచ్చాడు. తన సారథ్యం బాగోలేదని, ఆట ఒత్తిడి తనపై పడి తన మూడ్‌ను పాడుచేసిందని, అది అంతిమంగా తన ప్రదర్శనపై పడిందని వివరించాడు. కెప్టెన్‌గా తాను చాలా పేలవ ప్రదర్శన కనబరిచానని, జట్టుకు తలవంపులు తెచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
అంతేకాకుండా పైన్ పశ్చాత్తంపై కూడా అశ్విన్ స్పందించాడు. 'నేను వెర్రివాడినయ్యాను కదా' అని తనతో పైన్ అన్నట్టు చెప్పాడు. కాగా, మైదానంలో ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసినందుకు‌గాను పైన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత జరిమానా విధించిన విషయం తెల్సిందే.