శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (14:25 IST)

ధోనీ గుడ్‌బై చెప్పగానే యువీని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? భార్య అదృష్టమేమీ లేదట!

భారత వన్డే, ట్వంటీ20 జట్లకు నాయకత్వ బాధ్యతల నుంచి జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు. ఆ వెంటనే భారత క్రికెట్ జట్టులోకి యువరాజ్ చేరిపోయాడు. ఈనెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే స

భారత వన్డే, ట్వంటీ20 జట్లకు నాయకత్వ బాధ్యతల నుంచి జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు. ఆ వెంటనే భారత క్రికెట్ జట్టులోకి యువరాజ్ చేరిపోయాడు. ఈనెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్, ట్వంటీ-20 మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్లలో యువరాజ్ సింగ్‌కు స్థానం కల్పించారు. 
 
ఇంగ్లండ్ సిరీస్‌కు ఇటీవలే బీసీసీఐ జట్లను ప్రకటించిన విషయం తెల్సిందే. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టులోకి ఎంపిక చేసిన పేర్లను మీడియాకు వెల్లడించాడు. అయితే, ఊహించని విధంగా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఈ సందర్భంగా, యువరాజ్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని ప్రసాద్ వివరించాడు.
 
"డొమెస్టిక్ క్రికెట్ (దేశవాళీ)లో యువరాజ్ చాలా బాగా రాణించాడు. ఈ విషయంలో అతన్ని ప్రశంసించాలి. యువరాజ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడని ఇన్నాళ్లు భావించాం. కానీ, ఇటీవల కాలంలో యవీ అద్భుతమైన క్రికెట్ ఆడాడు. ఒక డబుల్ సెంచరీ చేశాడు. అనుకూలించని వికెట్ పై మరోసారి 180 పరుగులు చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో కనబరిచిన ఆట వల్లే యువీకు వన్డే టీమ్‌లో అవకాశం కల్పించాం" అని ఎమ్మెస్కే తెలిపాడు.  
 
అయితే, టీమిండియాలో యువీ పేరును ప్రకటించడానికి అతని వివాహం, భార్య అదృష్టమనే వార్తలు వచ్చాయి. వివాహమైన నెల రోజుల్లోనే భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకొన్నాడని అంటున్నారు. గతేడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా భారత జట్టులో చోటు దక్కించుకుని, గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రాలేదు.
 
గత ఐపీఎల్‌‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున పంజాబ్‌, కోల్‌‌కతాపై కీలక ఇన్నింగ్స్‌‌లు ఆడి జట్టును ఫైనల్‌‌లోకి తీసుకెళ్లాడు. అయినప్పటికీ టీమిండియా తలుపులు తెరుచుకోలేదు. దీంతో మరింత కసిగా 2016-17 రంజీ సీజన్‌‌లో ఆడి అద్భుతంగా రాణించాడు. పంజాబ్‌ కెప్టెన్‌‌గా 5 మ్యాచ్‌‌లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. 
 
దీంతో యువీకి భారత జట్టులో స్థానం కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వివాహం తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకోవడంతో క్రెడిట్ మొత్తం అభిమానులు హాజెల్ కీచ్‌కు ఇస్తున్నారు. గతంలో కోహ్లీ ఫెయిల్యూర్స్‌కు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను అభిమానులు నిందించిన సంగతి తెలిసిందే. అంటే.. భార్య కంటే.. దేశీయంగా జరిగిన టోర్నీల్లో యువీ అద్భుతంగా రాణించడం వల్లే చోటు దక్కిందని చెప్పవచ్చు.