శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:04 IST)

వారిద్దరి దూకుడుకి అడ్డుకట్ట వేయలేకపోయాం : స్టీవ్ స్మిత్

చెన్నై వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో హార్థిక్‌ పాండ్యా, ఎంఎస్ ధోనీల దూకుడుతో తేరుకోలేక పోయామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. పైగా ఈ మ్యాచ్‌లో తమ జట్టు చెత్తగా ఆడిందనీ, భారత కుర్

చెన్నై వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో హార్థిక్‌ పాండ్యా, ఎంఎస్ ధోనీల దూకుడుతో తేరుకోలేక పోయామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. పైగా ఈ మ్యాచ్‌లో తమ జట్టు చెత్తగా ఆడిందనీ, భారత కుర్రోళ్లు బాగా ఆడారని, అందువల్ల వారు విజయాన్ని కైవసం చేసుకున్నారని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.
 
ఐదు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ విధానం) పర్యాటక ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించి ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ... హార్థిక్‌ పాండ్యా, ఎంఎస్ ధోనీ భాగస్వామ్యం మ్యాచ్‌ను తమకు కాకుండా చేసిందని, ఆ ఇద్దరి భాగస్వామ్యం వల్లే తాము ఓడామన్నారు. 
 
'కొత్త బాల్‌తో మేం బాగా బౌలింగ్ చేశాం. కానీ భారత ఆటగాళ్లను నియంత్రించలేకపోయాం. ముఖ్యంగా ఎంఎస్‌ ధోనీ, హార్థిక్‌ బాగా ఆడారు. మ్యాచ్‌లో డిఫరెన్స్‌ చూపింది వారే. మంచి ఆరంభం దొరికినా దానిని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం' అని స్మీత్‌ అన్నాడు.
 
అదేసమయంలో వర్షం అడ్డంకిగా మారడం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపిందని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్‌ మిడిలార్డర్‌లో మేం త్వరగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. అయినా వాతావరణాన్ని మేం నియంత్రించలేం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు' అని అన్నాడు. ఈరోజు మేం బాగా ఆడలేదు. భారత్‌ మా కన్నా మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు' అని స్మీత్‌ పేర్కొన్నాడు.  
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఎట్టకేలకు వాన ఆగిన తర్వాత ఆసీస్‌ విజయ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. ఆ జట్టు చివరకు 21 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరుగుతుంది.