శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (17:31 IST)

కరోనా కల్లోలం : ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ వాయిదా? ఐపీఎల్ ఖాయమా?

కరోనా మహమ్మారి కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలు వాయిదాపడుతున్నాయి. తాజాగా స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 11వ సీజన్ కూడా రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిజానికి ఈ టోర్నీ గత మార్చి నెలలో ప్రారంభమై, మే నెలలో ముగియాల్సివుంది. కానీ, కరోనా కారణంగా ఈ టోర్నీ వాయిదాపడింది. ఇపుడు ఐసీసీ ట్వంటీ20 టోర్నీ కూడా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఈ టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సివుంది. కానీ, ఈ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.
 
గురువారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది.
 
అయితే కరోనా కారణంగా వీసాల ప్రక్రియను ఆ దేశం ఆపేసింది. పర్యాటక వీసాలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ జరిపేందుకు అనువైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోవడంతో.. టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
అయితే, బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ 11వ అంచె పోటీలు మాత్రం వచ్చే అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇపుడు ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ వాయిదాపడినట్టయితే, ఖచ్చితంగా ఐపీఎల్ టోర్నీని బీసీసీఐ నిర్వహించే అవకాశాలు ఉంటాయని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.