శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (23:09 IST)

చెన్నై వన్డేలో భారత్ ఘన విజయం.. ఒత్తిడికి తలొంచిన ఆస్ట్రేలియా

చెన్నై వేదికగా పర్యాటక ఆదివారం రాత్రి జరిగిన డే అండ్ నైట్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలి

చెన్నై వేదికగా పర్యాటక ఆదివారం రాత్రి జరిగిన డే అండ్ నైట్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 164 పరుగులు చేయాల్సి ఉండగా.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 281/7 చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించి ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. దీంతో 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
అంతకుముందు... తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ అజింక్యా రహానే (5) నైల్ బౌలింగ్‌లో వాడెకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 11 పరుగులు. అదే స్కోరు వద్ద భారత్ వరుసగా విరాట్ కోహ్లీ (0), మనీష్ పాండే (0) వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. 
 
ఈ క్రమంలో రోహిత్ శర్మ (28), కేదార్ జాదవ్ (40) జట్టు భారాన్ని తమపై వేసుకుని మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే స్టోయిన్స్ వేసిన బంతికి తడబడ్డ రోహిత్ శర్మ (28) కల్టెర్ నైల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 87 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (40) కూడా ఔటయ్యాడు.
 
87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో మాజీ సారథి ధోనీ, హార్ధిక్ పాండ్యాలు కలిసి జాగ్రత్తగా ఆడారు. పాండ్యా క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించాడు. దీంతో అప్పటి వరకు నత్తనడకన సాగిన స్కోరు ఒక్కసారిగా ఉరుకులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. 
అనంతరం బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ధోనీ దాటిగా ఆడడం మొదలుపెట్టాడు. 
 
ఈ క్రమంలో వన్డేల్లో 66వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడుతూ స్కోరు పెంచే క్రమంలో 50వ ఓవర్ నాలుగో బంతికి ధోనీ (79) ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ 29 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి ఆసీస్‌కు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో నైల్‌ 3 వికెట్లు తీయగా స్టోయిన్స్ 2, ఫాల్కనర్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడికి తలొగ్గి 21 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.