గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (19:07 IST)

రాంచీ వన్డే.. ఉస్మాన్ ఖవాజా తొలి సెంచరీ.. కంగారూల ఖాతాలో రికార్డు

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (113 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 104 పరుగులు) వన్డేల్లో తొలిసారి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
మార్కస్ స్టొయనిస్ 26 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 31 పరుగులు, అలెక్స్ కేరీ 17 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. 
 
తదనంతరం 314 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలో గట్టి దెబ్బ తలిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఔటయ్యారు. పది ఓవర్లలో భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (15 బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు), వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ (13 బంతుల్లో రెండు ఫోర్లతో 9 పరుగులు) క్రీజులో ఉన్నారు.
 
ఈ వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వన్డేల్లో తొలిసారి సెంచరీ సాధించిన రికార్డుతో పాటు ఆస్ట్రేలియా జట్టు వందోసారి 300లకు పైగా పరుగులు సాధించిన రెండో జట్టుగా రికార్డు సాధించింది. తొలిస్థానంలో భారత జట్టు వుండగా, కంగారూలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టీమిండియా ఇప్పటికే 105 సార్లు వన్డేల్లో 300లకు పైగా పరుగులు నమోదు చేసింది.