1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (12:50 IST)

విశాఖ టెస్టులో భారత్ ఘన విజయం.. 246 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్ ఓటమి

విశాఖ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేని పర్యాటక ఇంగ్లండ్ జట్టు 246 పరుగుల తేడాతో ఓడిపోయింది. అచ్చొచ్చిన విశాఖలో భారత బౌలర్లు చెలరేగిపోయా

విశాఖ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేని పర్యాటక ఇంగ్లండ్ జట్టు 246 పరుగుల తేడాతో ఓడిపోయింది. అచ్చొచ్చిన విశాఖలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తద్వారా ఇంగ్లండ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
 
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 455 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 255 పరుగులకే ఆలౌట్ అయింది. వాస్తవానికి ఇక్కడ ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ అవకాశాన్ని ప్రత్యర్థి జట్టుకు ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌కు దిగాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 405 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 158 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 246 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 
 
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో కుక్ 54, హమీద్ 25, రూట్ 25, డకెట్ 0, అలీ 2, స్టోక్స్ 6, బెయిర్ స్టో 34, రషీద్ 4, అన్సారీ 0, బ్రాడ్ 5, అండర్సన్ 0 చొప్పున పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో మూడు పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో అశ్విన్, యాదవ్‌లు మూడేసి చొప్పున వికెట్లు తీయగా, జడేజా, షమీలు తలా రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచారు.