శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (12:25 IST)

పవిత్ర గంగాస్నానం చేసిన సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం

పవిత్ర గంగానదిలో స్నానం చేయాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. ఆ పవిత్ర స్నానం కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళుతుంటారు. అయినప్పటికీ.. చాలామందికి గంగానదిలో స్నానం చేసే అదృష్టం దక్కదు. అలా, గంగానదిలో పవిత్ర స్నానాన్ని సౌతాఫ్రికాకు చెందిన క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఆచరించారు. రిషికేశ్‌లో ఆయన ఈ స్నానం చేశారు. ఈయన ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. పవిత్ర గంగా నదిలోని చల్లటి నీటిలో మునగడం వల్ల శారీరకంగానేకాకుండా ఆథ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. మోక్ష, రిషికేశ్, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగులు కూడా పెట్టారు.
 
జాంటీ రోడ్స్‌కు భారత్ అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ కారణంగానే 2016లో జన్మించిన తన కుమార్తెకు 'ఇండియా జియానే రోడ్స్' అని పేరు పెట్టారు. గతంలో రోడ్స్ మాట్లాడుతూ, ఇండియాలో తాను ఎంతో కాలం గడిపానని చెప్పారు. అత్యున్నతమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం సమ్మిళమైన ఈ దేశమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. 
 
ఆథ్యాత్మికానికి భారత్ కేంద్ర బిందువని చెప్పారు. ఇక్కడి వారి జీవితాలు సమతూకంతో, ప్రశాంతంగా ఉంటాయని అన్నారు. అందుకే తన కూతురుకి ఇండియా వచ్చేలా పేరు పెట్టానని చెప్పారు. ఇండియా జియానే రోడ్స్ పేరుతో తన కూతురు రెండు దేశాలకు అనుసంధానమై ఉంటుందని... ఆమె జీవితం సమతుల్యంగా ఉంటుందని అన్నారు.