శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (11:33 IST)

క్రికెట్ కెరీర్‌కు లసిత్ మలింగా గుడ్‌బై.. ఆ మ్యాచ్ తర్వాతే...

అంతర్జాతీయ క్రికెట్‌లో విలక్షణమైన బౌలింగ్‌తో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన బౌలర్ లసిత్ మలింగా. తన పేస్  బౌలింగ్ ద్వారా శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో కూడా బాగా రాణించాడు. అయితే, ఈ వరల్డ్ కప్ టోర్నీ తర్వాత క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెపుతానని లసిత్ మలింగా ముందుగానే ప్రకటించాడు. 
 
ఇపుడు ఈ నెల 26వ తేదీన తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్నాడు. శ్రీలంక - బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 26వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె తెలిపాడు. 
 
బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో 36 ఏళ్ల మలింగా కూడా ఉన్నాడు. అయితే, సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కిప్పర్ కరుణరత్నే మాట్లాడుతూ.. మలింగా తొలి వన్డే మాత్రమే ఆడతాడని ప్రకటించాడు. మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిపాడు. సెలక్టర్లకు అతడు ఏం చెప్పాడో తనకు తెలియదని, కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ గురించి చెప్పాడని వివరించాడు. 
 
కాగా, 2004 సంవత్సరం జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లసిత్ మలింగా... ఇప్పటివరకు 225 అంతర్జాతీయ వన్డేలు ఆడి 335 వికెట్లను పడగొట్టాడు. 300 పైచిలుకు వికెట్లు తీసిన బౌలర్లలో లసిత్ మలింగా మూడో బౌలర్‌గా ఖ్యాతిగడించాడు. 
 
మలింగా కంటే దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (523), చామిందా వాస్ (399) ఉన్నారు. పైగా, ప్రపంచకప్‌లో మాత్రం అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మలింగ పేరుపైనే ఉంది. మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. కాగా, మలింగ 2011లోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే.