శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (17:03 IST)

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: 215 పరుగులకే టీమిండియా ఆలౌట్!

దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో జరుగుతున్న టెస్టులో భారత్ అతికష్టంమీద 215 పరుగులు సాధించింది. సఫారీల పేస్ బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది.

భారత బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ (40) ఓ మోస్తరుగా రాణించినా, శిఖర్ ధావన్ (12) పరుగులకే విఫలమయ్యాడు. తదనంతరం బరిలోకి దిగిన పుజారా (21), కెప్టెన్ కోహ్లీ (22) భారీ స్కోర్లు సాధించలేకపోయారు. అజింక్యా రెహానే (13), రోహిత్ (2) కూడా నిరాశపరిచారు. 
 
అనంతరం కీపర్ వృద్ధిమాన్ సాహా(32), రవీంద్ర జడేజా (34) రాణించారు. దీంతో టీమిండియా 200 మార్కు దాటింది. అనంతరం వచ్చిన అశ్విన్ (15), మిశ్రా (3) నిలకడగా ఆడినా హార్మర్, మోర్కెల్ బౌలింగ్ ధాటికి స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. తద్వారా భారత్ 215 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో అన్నీ వికెట్లు కోల్పోయింది.

సఫారీ బౌలర్లలో మోర్కెల్ మూడు వికెట్లు నేలకూల్చగా, హార్మర్ మూడు వికెట్లతో రాణించాడు. రబడా, ఎల్గర్, తహీర్‌లు తలా ఒక్కో వికెట్ పడగొట్టి టీమిండియా బ్యాట్స్‌మెన్లను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా 78.2 ఓవర్లలో 215 పరుగులకే భారత్ అవుటైంది.