శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (02:13 IST)

ధోనీ, యువరాజ్‌ల పని ముగిసినట్లేనా.. ద్రావిడ్ ఊరకే అంతమాట అనడు కదా

ఒకవైపు విరాట్ కోహ్లీ అసంతృప్తిని సాకుగా తీసుకుని అనిల్ కుంబ్లే అంతటి జెంటిల్మన్‌నే పక్కన పెట్టేయాలని బీసీసీసీ దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్లే కనబడుతోంది. మరోవైపు కోహ్లీ ఇష్టపడి, సిఫార్సు చేసి మరీ జట్టులోకి తీసుకున్న యువరాజ్ సింగ్, కెరీర్‌లో చివరి దశల

ఒకవైపు విరాట్ కోహ్లీ అసంతృప్తిని సాకుగా తీసుకుని అనిల్ కుంబ్లే అంతటి జెంటిల్మన్‌నే పక్కన పెట్టేయాలని బీసీసీసీ దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్లే కనబడుతోంది. మరోవైపు కోహ్లీ ఇష్టపడి, సిఫార్సు చేసి మరీ జట్టులోకి తీసుకున్న యువరాజ్ సింగ్, కెరీర్‌లో చివరి దశలో ఉన్నట్లు భావిస్తున్న ఎమ్ఎస్ ధోనీలను ఇంకా ఎన్నాళ్లు జట్టులో ఉంచుతున్నారు అంటూ రాహుల్ ద్రావిడ్ పెద్ద బాంబు వేశాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీమిండియాకు ఏమవుతోంది, బీసీసీఐలో ఏం జరుగుతోంది అని సందేహాలు రేకెత్తుతున్నాయి.
 
భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌లో జరిగే 2019 వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌ ఈ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు. 
 
‘రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు సంబంధించి రోడ్‌ మ్యాప్‌ను చూస్తే వచ్చే రెండేళ్లలో ధోని, యువీ పాత్ర ఎలా ఉండబోతోంది నాలుగు, ఐదు స్థానాల్లో ఆడుతున్న వీరిద్దరికీ జట్టులో చోటు ఉంటుందా లేక ఒక్కరికే అవకాశముందా వీరి ఆటను వచ్చే ఆరు నెలల్లో లేదా ఏడాది కాలంలో మళ్లీ సమీక్షిస్తారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యువ ప్రతిభను వాడుకుంటారా లేక ఈ ఇద్దరు సీనియర్లపైనే ఆధారపడతారా అనే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.  వెస్టిండీస్‌ సిరీస్‌లో కూడా తుది జట్టు విషయంలో ప్రయోగాలు చేయలేకపోతే కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది’ అని ద్రవిడ్‌ వ్యాఖ్యానించారు. 
 
బ్యాటింగ్‌ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు ప్రభావం చూపలేకపోతున్నారన్న ద్రవిడ్‌... బౌలింగ్‌ శైలిలో ప్రత్యేకత ఉన్న స్పిన్నర్లను ఎంపిక చేయాలని సలహా ఇచ్చారు. చాంపియన్స్‌ ట్రోఫీ పరాజయానికి పూర్తిగా ధోని, యువరాజ్‌లే కారణం కాకపోయినా... వారు ఆడుతున్న స్థానాలను బట్టి చూస్తే తుది జట్టు కూర్పు కష్టంగా మారిపోతోందని మరో మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ విశ్లేషించారు.
 
 మొత్తంమీద టీమిండియాలో సీనియర్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల స్థానాలు కదులుతున్నట్లే భావించాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా గడ్డు స్థితి ఎదురు కాబోతున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్‌లో ఘోరపరాజయం తర్వాత జరుగుతున్న ఘటనలను చూస్తుంటే బీసీసీఐలో ఏదో జరుగుతోందనిపిస్తోంది.