ఐపీఎల్-8 : హైదరాబాద్ ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గెలుపు!
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకుంది.
రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్ లో ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆ తరుణంలో క్రీజ్ లో స్టువర్ట్ బిన్నీ(16), ఫాల్కనర్(6) పరుగులు చేసి రాయల్స్కు విజయాన్ని అందించారు. కడవరకూ సాగిన మ్యాచ్లో ఆఖరి బంతిని ఫల్కనర్ ఫోర్ కొట్టడంతో రాయల్స్ బతికి బయటపడింది. దీంతో రాజస్థాన్ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
రాజస్థాన్ ఆటగాళ్లలో సంజూ శాంసన్(26), స్టీవ్ స్మిత్(13), కరుణ్ నాయర్ (1) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరినా.. ఓపెనర్ అజ్యింకా రహానే (62) పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ బౌలర్లలో రవి బొపరాకు రెండు వికెట్లు దక్కగా, కేవీ శర్మ, బౌల్ట్ లకు తలో ఒక వికెట్ లభించింది. అంతకుముందు టాస్ ఓడిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.