శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (11:08 IST)

లక్నో ట్వంటీ20 : రోహిత్ ధమాకా... భారత్‌దే టీ20 సిరీస్‌

లక్నో వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు విజయభేరీ మోగించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా కేవలం 61 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్ల సాయంతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేయడంతో వెస్టిండీస్‌తో రెండో టీ20లోనూ భారత్‌ 71 పరుగులతో జయభేరి మోగించింది. ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 195/2 చేసింది. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 124/9కే పరిమితమైంది. 130 పరుగులు చేస్తే గొప్ప అని భావించిన పిచ్‌పై రోహిత్ మ్యాన్‌ ఒక్కడే అజేయంగా 111 పరుగులు చేశాడు. ఇక అతను ఆ స్థాయిలో ఆడాడంటే చెప్పేదేముంది.. దాదాపు పాతికేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను చూసిన లక్నో ప్రేక్షకులకు ఒక రోజు ముందే పరుగుల టపాసులతో దీపావళిని జరిపేసుకున్నట్టయింది. 
 
ప్రస్తుతం భారత్‌ 2-0 ఆధిక్యంలో ఉండగా చివరిదైన మూడో టీ20 ఈ ఆదివారం చెన్నైలో జరుగుతుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (41 బంతుల్లో 3 ఫోర్లతో 43), రాహుల్‌ (14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 నాటౌట్‌) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసి ఓడింది. కుల్దీప్, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, భువనేశ్వర్‌ రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు దక్కింది.