శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (14:05 IST)

ఫిట్నెస్ పరీక్షలో సక్సెస్... రోహిత్ శర్మకు లైన్ క్లియర్

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో ఆయనకు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో రోహిత్ పాస్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
దుబాయ్ గడ్డపై జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో రోహిత్ శర్మ గాయపడిన విషయం తెల్సిందే. దీంతో రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించలేదు. 
 
ఈ క్రమంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్‌ టెస్టులో హిట్‌మ్యాన్‌ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్నెస్‌ పరీక్ష నిర్వహించారు. 
 
కాగా ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ సఫలం కావడంతో డిసెంబర్‌ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్‌ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు.