గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (12:19 IST)

చాలామందికి అర్థంకాదు : ధోనీ విమర్శకులపై రోహిత్‌

ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. కొందరు మాజీ క్రికెటర్లకు ఇదేపని అయిపోయింది కూడా.

ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. కొందరు మాజీ క్రికెటర్లకు ఇదేపని అయిపోయింది కూడా. ఈ విమర్శలపై భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. ఇపుడు క్రికెటర్ రోహిత్ శర్మ వంతైంది. 
 
వెటరన్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ ధోనీపై విమర్శలను తిప్పికొడుతూ కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తి పలు సందర్భాల్లో సహచరుడికి మద్ద తుగా నిలిచారు. ఇప్పుడు రోహిత్‌ శర్మ..ధోనీని పూర్తిగా వెనకేసుకొచ్చాడు. ‘జట్టులో ధోనీ పాత్ర ఏమిటో వారికి అర్థంకాదు’ అని మహీ విమర్శకులనుద్దేశించి వ్యాఖ్యానించాడు. 
 
నిజానికి న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ధోనీ విఫలం కావడంతో పరిమిత ఓవర్ల నుంచి ముఖ్యంగా టీ20ల నుంచి ధోనీ వైదొలిగి యువకుల అవకాశాలకు బాటలు వేయాలని మాజీలు వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఆకాశ్‌ చోప్రా, అజిత్‌ అగార్కర్‌ సూచించారు. అయితే మూడురోజుల కిందట ముగిసిన శ్రీలంక సిరీస్‌లో.. మహీ బ్యాటింగ్‌లోనే కాకుండా, కీపింగ్‌లోనూ రాణించాడు. తద్వారా తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. 
 
ఈ నేపథ్యంలో జట్టులో ధోనీ పాత్ర ఎంత కీలకమో శ్రీలంకతో వన్డేలు, టీ20లకు భారత్‌ తాత్కాలిక సారథిగా వ్యవహరించిన రోహిత్‌ గుర్తుచేశాడు. 'ఇటీవలి కాలంలో ధోనీ ప్రదర్శన జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోదు. బుమ్రా, కుల్దీప్‌, చాహల్‌ లేదా మరే బౌలర్‌ మైదానంలో ధోనీ సలహాలు తీసుకోవడం మీరు చూసే ఉంటారు. బౌలర్‌ ఏం చేయబోతున్నాడో మహీకి తెలుసు. అలా జట్టులో అతడు ఎంత ముఖ్య భూమిక పోషిస్తున్నాడో చాలామందికి అర్థంకాదు. ధోనీ భారత్‌కు ఎన్నో టోర్నీలు అందించాడు. అతడి అనుభవం జట్టుకు ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ఇప్పటికీ మహీ టీమ్‌ లీడరే. యువకులకు ఇకపైనా మార్గదర్శిగా ఉంటాడు. అతడి సలహాలు అమూల్యం' అంటూ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.