శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (12:08 IST)

టీమిండియా చేతిలో ఓటమి: సెలెక్టర్లు మూకుమ్మడి రాజీనామా.. రణతుంగ అంత మాటన్నాడే?

శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంక క్రికెటర్లను వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు శ్రీలంక జట్టు సెలక్షన్ కమిటీ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. మరోవైపు మూడో వన్డేలో

శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంక క్రికెటర్లను వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు శ్రీలంక జట్టు సెలక్షన్ కమిటీ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. మరోవైపు మూడో వన్డేలో టాస్ గెలిచినప్పటికీ కెప్టెన్ కపుగెదర తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.
 
ఆదివారం పల్లెకెలెలో జరిగిన మూడో వన్డేలో జట్టు సభ్యులంతా బౌలింగ్‌కు దిగుదామని చెప్పినప్పటికీ... కెప్టెన్ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు దృష్టికి వెళ్లింది. శ్రీలంక జట్టు సారధి తరంగపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించడంతో... ఈ రెండు వన్డేలకు కపుగెదర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పటి నుంచి టాస్ విషయంలో భారత్‌దే పైచేయిగా వుంటూ వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా ఘనవిజయం సాధించి వన్డే సిరీస్ కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీలంక క్రికెట్ యాజమాన్యం విచారణకు ఆదేశించినట్టు కనిపిస్తోంది.
 
మరోవైపు శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత అభిమానుల్లా ప్రవర్తించవద్దని శ్రీలంక అభిమానులకు సూచించాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు మైదానంలోని ఫీల్డర్లపై బాటిళ్లు విసిరారు. దీంతో​మ్యాచ్‌ 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
 
లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్‌ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్‌ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉందంటూ కామెంట్ చేశాడు. రణతుంగ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.