బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (15:23 IST)

ఐదేళ్లు క్రికెట్ ఆడకపోయినా ఛాన్స్ కొట్టేశాడు.. ఎవరీ శివం దూబే

శివం దూబే. ప్రస్తుతం ఈ పేరుపై భారత క్రికెట్‌లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల మూడో తేదీ నుంచి బంగ్లాదేశ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు ట్వంటీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో శివం దూబేకు చోటుకల్పించారు. ఈ యవ క్రికెటర్ ఐదేళ్ళ పాటు క్రికెట్‌కు దూరమైన జట్టులో మాత్రం చోటు దక్కించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
దీనికి కారణం.. శివం దూబే దేశవాళీ క్రికెట్‌లో అమితంగా రాణిస్తుండటమే. ఇటీవల భారీ సిక్సర్లు కొడుతూ వెలుగులోకి వచ్చాడు. ఫలితంగా ఈ 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్‌ని హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. హార్దిక్‌ పాండ్యా వెన్నుముక గాయం కారణంగా సర్జరీ చేయించుకోవడంతో దూబెను సెలక్టర్లు ఎంపిక చేశారు.
 
గతేడాది బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో దూబే వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి ఒక‍్కసారిగా అందర్నీ ఆకర్షించాడు. 2018 రంజీ ట్రోఫీలో మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. 91 యావరేజ్‌తో 364 పరుగులు సాధించాడు. మరొకవైపు 12 వికెట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. కుడిచేతి వాటం మీడియం పాస్ట్‌ బౌలర్‌ అయిన దూబే లిస్ట్‌ ఏ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. 
 
ఈ యేడాది విజయ్‌ హజారే ట్రోఫీలో సైతం దూబే ఆకట్టుకున్నాడు. లిస్ట్‌-ఏ 73.2 సగటుతో 137కు పైగా స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 366  పరుగులు సాధించాడు. అయితే దూబే  క్రికెట్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్న దూబే తాను క్రికెట్‌ ఆడటం దగ్గర్నుంచి నేటి వరకూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాడు.