1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (17:01 IST)

ధోనీ తర్వాత రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించానంటే... సురేష్ రైనా క్లారిటీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15వ తేదీన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. అనుకోకుండా ప్రకటించిన ఈ నిర్ణయంతో యావత్ క్రిడాలోకం ఆశ్చర్యానికి లోనైంది. దీని నుంచి కోలుకోకముందే, మరో క్రికెటర్ సురేష్ రైనా కూడా స్వస్తి చెపుతున్నట్టు ప్రకటించాడు. 
 
సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15వ తేదీన ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా రాజీనామా ప్రకటించడంతో రాముడికి తోడు లక్ష్మణుడు అంటూ కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ధోనీ రాజీనామా విషయం అందరూ ఊహించిందే అయినా... ఎప్పుడు చేస్తాడో తెలియక కాస్త గందరగోళానికి లోనయ్యారు. 
 
కానీ సురేశ్ రైనా మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధోనీ చేసిన రోజే రాజీనామా ప్రకటన చేశారు. దీని వెనక కారణం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ.. సురేశ్ రైనా పెదవి విప్పాడు. తన రాజీనామాకు గల కారణాలపై క్లారిటీ ఇచ్చాడు.
 
ధోనీ జెర్సీ నంబర్ 7 అని, తన జెర్సీ నంబర్ 3 అని రెండూ కలిపితే 73 వస్తుందన్నాడు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 73 ఏళ్లు పూర్తయ్యాయని.. అందుకే తాను అదే రోజు రాజీనామా ప్రకటన చేశానని చెప్పుకొచ్చాడు. 
 
ధోనీ, రైనా దాదాపుగా కొన్ని నెలల తేడాతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో ధోనీ ఆరంగేట్రం చేస్తే.. 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో రైనా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు.