బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:20 IST)

జట్టులో స్థానం కల్పించలేదని సెలెక్టర్‌ను బ్యాట్లతో బాదారు...

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అమిత్ భండారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతను ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అనుకోకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కశ్మీరీ గేట్‌లోని సెయింట్ స్టిఫెన్స్ గౌండ్ సమీపంలో అతడిపై దాడికి దిగారు. ఆ గ్రౌండ్‌లో అండర్-23 జట్టు కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి.
 
కాగా ట్రయల్స్ ముగించుకొని బయటకు వచ్చిన అమిత్ భండారిపై యువకులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని సంత్ పరమానంద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. అండర్-23 జట్టులో చోటు లభించని కొందరు కక్షతో దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
దాడిలో భండారి తలకు, కాళ్ల భాగంలో ఏడు కుట్లు పడ్డాయని, ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జట్టు సెలక్షన్‌లో స్థానం లభించని కొంతమంది ఆటగాళ్లు కక్షతో దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడిందని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.