గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ : ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లీ సేన

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఇందుకోసం అన్ని క్రికెట్ జట్లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్వితీయంగా రాణిస్తోంది. 
 
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ రాణించి సఫారీలను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
 
ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ షురూ అయింది. ఇక మీదట ఆయా దేశాలు ఆడే టెస్టు మ్యాచ్‌లు వరల్డ్ చాంపియన్ షిప్‌లో భాగంగానే నిర్వహిస్తారు. 
 
ఈ క్రమంలో చాంపియన్ షిప్ మొదలయ్యాక భారత్ ఆడిన 3 టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇటీవలే విండీస్ గడ్డపై రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన భారత్, ఇప్పుడు సొంతగడ్డపైనా అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
 
ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ ఉంది. అయితే, భారత్‌కు కివీస్ జట్లకు మధ్య దాదాపు వంద పాయింట్ల మేరకు వ్యత్యాసం ఉంది. కివీస్ ఖాతాలో 60 పాయింట్లే ఉన్నాయి. అలాగే, శ్రీలంక కూడా 60 పాయింట్లు సాధించింది. బలమైన టెస్టు జట్లుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఈ జాబితాలో 4, 5 స్థానాల్లో ఉన్నాయి. 
 
ఇటీవలే యాషెస్ లో భాగంగా 5 టెస్టులాడిన ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, టెస్టు వరల్డ్ చాంపియన్ షిప్ మొదలయ్యాక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడని కారణంగా పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిసాయి.