1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (12:29 IST)

ఆ ఆటగాడు తప్పు చేస్తే.. జడేజాకు ఫైన్ వేస్తారా : ధోనీ

ఇంగ్లండ్ క్రికెటర్ ఆండర్సన్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎంతగానంటే.. ఆండర్సన్ పేరును సైతం ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడటం లేదు. జడేజాతో గొడవ ఉదంతంలో ఇంగ్లండ్ క్రికెటర్ ఆండర్సన్ పై ధోనీ మండిపడుతున్నాడు.
 
ఆండర్సన్ జడేజా గొడవపై ధోనీ స్పందిస్తూ.. లంచ్ బ్రేక్‌లో అందరం పెవిలియన్‌కు బయలుదేరాం. ఇంతలో అతను జడేజాను బూతులు తిట్టడం ప్రారంభించాడు. నేను కల్పించుకున్నా... అంతా సమసిపోయిందని భావించా. మెంబర్స్ ఏరియా నుంచి నడుస్తున్న సమయంలో అతను మళ్లీ జడేజాను ఏదో అన్నాడు. జడేజా అతని వైపు తిరిగాడు. ఆ సమయంలో అతను జడేజాను నెట్టేశాడు. అదుపుతప్పిన జడేజా... ఏం జరుగుతోందా? అని అతని వైపు చూశాడు. ఈ మాత్రం దానికే జడేజాకు ఫైన్ వేశారు. రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. 
 
ఇది ముమ్మాటికీ క్రీడా స్ఫూర్తి కాదు. జడేజా ఒక్క మాట కూడా అనలేదు... తప్పంతా ఆ క్రికెటర్‌దే. అవతలి వాడు తిడితే... జడేజా ఫీజులో కోత విధించడం ఏమిటి? దీనిపై అప్పీల్ చేయాలనే నేను కోరుకుంటున్నా. ఇలా జరిగితే... మైదానంలో సంయమనంతో మెలగాలని మా ఆటగాళ్లకు నేనెలా చెప్పగలను? వాళ్లు నా మాట వింటారా? అంటూ ఆ రోజు జరిగిన ఘటనను ధోనీ వివరించాడు. ఈ సమయంలో ఆండర్సన్ పేరును ధోనీ ఉచ్చరించకపోవడం గమనార్హం! 
 
మిస్టర్ కూల్‌గా పేరుగాంచిన ధోనీ ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆగ్రహావేశాలకు, ఉద్వేగాలకు లోనుకాడు. అందుకే ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ధోనీ ఇప్పుడు ఓ క్రికెటర్ పై అంతులేని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.