నాపేరు లూ విన్సెంట్. నేను క్రికెట్ను మోసం చేశాను!
న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మన్ లూ విన్సెంట్పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం పడింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి క్రికెట్ను మోసం చేశానని ఈ ఆటగాడు బహిరంగంగా అంగీకరించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్టి20) ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కౌంటీ మ్యాచ్లతో పాటు 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున ఆడుతూ ఫిక్స్ చేసినట్టు విన్సెంట్ అంగీకరించాడు. ‘నాపేరు లూ విన్సెంట్. నేను క్రికెట్ను మోసం చేశాను. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నా స్థానాన్ని అనేక సార్లు దుర్వినియోగం చేశాను. మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు పలుమార్లు డబ్బులు తీసుకున్నాను.
నేను నా దేశాన్నే కాకుండా, క్రికెట్ను, సన్నిహితులను మోసం చేశాను. ఈ విషయంలో తలదించుకుంటున్నాను. నా దేశ ప్రజలకు, ప్రపంచానికి, క్రికెట్ అభిమానులకు, కోచ్లకు, ఆటగాళ్లకు క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ 35 ఏళ్ల విన్సెంట్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
క్రికెట్ కెరీర్లో విన్సెంట్ 23 టెస్టుల్లో 1332 పరుగులు చేయగా ఇందులో 3 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉంది. 102 వన్డేల్లో 2413 పరుగులు చేశాడు. తొమ్మిది టి20లు ఆడాడు. ఇకపోతే.. దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున విన్సెంట్ బరిలోకి దిగి రెండు మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు.