శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (05:16 IST)

కోహ్లీ అజేయ శతకంతో ఐదు వన్డేల సీరీస్ -3-1- భారత్ కైవసం

గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని మర

గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్‌ సేన చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. గత మ్యాచ్‌లో లాగే ఛేదనలో భారత్‌ను కట్టడి చేసి సిరీస్‌ను సమం చేయాలనుకున్న విండీస్‌ ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(111 నాటౌట్‌: 115 బంతుల్లో 12×4, 2×6) అజేయ శతకం ముందు తేలిపోయింది. 
 
ఐదో వన్డేలో  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. మహ్మద్‌ షమీ(4/48), ఉమేశ్‌ యాదవ్‌(3/53) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. హోప్‌ సోదరులు షెయ్‌(51), కైల్‌ (46) రాణించడంతో విండీస్‌ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. అనంతరం భారత ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి శతకం, దినేశ్‌ కార్తిక్‌ అర్ధశతకంతో రాణించడంతో భారత్‌ 36.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను విరాట్‌ కోహ్లి అందుకోగా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును ఆజింక్య రహానె దక్కించుకున్నాడు.
 
విదేశీ గడ్డపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన జోరు కొనసాగిస్తున్నాడు. నాలుగో వన్డేలో చేసిన లోపాలను సరిదిద్దుకుని చివరిదైన ఐదో వన్డేలో అద్భుత శతకంతో రాణించాడు. విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అలవోకగా పరుగులు సాధించాడు. 108 బంతులాడిన విరాట్‌ 12ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.వన్డేల్లో అతనికి ఇది 28వ శతకం కావడం విశేషం. వన్డే మ్యాచ్‌ల్లో ఛేదనలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ రికార్డును విరాట్‌ అధిగమించాడు. పరుగుల యంత్రం విరాట్‌ 28 శతకాల్లో 18 సెంచరీలను ఛేదనలోనే సాధించడం విశేషం.
 
206 పరుగుల ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోసెఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఆఖరి బంతికే శిఖర్‌ ధావన్‌(4) ఔటయ్యాడు. సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలమై నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్‌, మరో ఓపెనర్‌ రహానె మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కోహ్లీ సైతం క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సేపు శ్రమించాడు. మరో ఎండ్‌లో రహానె అడపాదడపా బౌండరీలు బాదుతూ నిదానంగా స్కోరు వేగం పెంచాడు. 22 ఓవర్లకు భారత్‌ 108/2 స్థితిలో నిలిచింది. 
 
సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో విరాట్‌ గేర్‌ మార్చాడు. వికెట్ల వేటలో పడిన విండీస్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ షాట్లతో చెలరేగాడు. మరో ఎండ్‌లో ఉన్న దినేశ్‌ కార్తిక్‌ దూకుడుగానే క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి దుకుడుగా ఆడుతూ వచ్చాడు. ముఖ్యంగా కోహ్లి చాలా రోజుల తర్వాత తన కళాత్మక షాట్లతో అలరించాడు. జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌లా.. విరాట్‌ సబీనా పార్క్‌లో పరుగుల వరదపారించి అభిమానులను ఉత్సాహపరిచాడు.