గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (19:17 IST)

అపుడు హీరో.. ఇపుడు విలన్ .. అతనే మార్టిన్ గుప్తిల్ (video)

మార్టిన్ గుప్తిల్... న్యూజిలాండ్ ఓపెనర్. సెమీస్‌లో భారత్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇతనే. భారత విజయం అంచులకు తీసుకెళ్లిన భారత క్రికెట్ జట్టు కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని రెప్పపాటులో రనౌట్ చేసి ఆటగాడు. తద్వారా తమ స్వదేశంలో హీరో అయిపోయాడు. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కారణంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన గుప్తిల్.. ఈ ఒక్క రనౌట్ కారణంగా శభాష్ అనిపించుకున్నాడు.
 
అయితే, ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం గుప్తిలే. ఒక్క బంతికి రెండు పరుగులు చేస్తే విశ్వవిజేతగా న్యూజిలాండ్ అవతరిస్తుంది. కానీ, ఒక్క పరుగు చేసి.. రెండో పరుగు కోసం లంఘించి రనౌట్ అయ్యాడు. దీంతో బౌండరీ నిబంధన ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. 
 
న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్‌ వైఫల్యమే. సీనియర్‌ మార్టిన్‌ గుప్తిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్‌ ధోనీని అద్భుత త్రో ద్వారా రనౌట్‌ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. 
 
బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్‌ నాలుగో బంతిని ఓవర్‌ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గుప్తిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్‌ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి ప్రపంచ కప్‌ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్‌ అనంతరం గుప్తిల్ కన్నీటి పర్యంతమయ్యాడు.