శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (11:25 IST)

నువ్వు అత్యుత్తమైన వ్యక్తివి.. నీ ప్రయాణం అద్భుతంగా సాగాలి : కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు గుడ్‌బై చెప్పగా, దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. "రాయుడూ.. నువ్వు అత్యున్నతమైన వ్యక్తివి.. నీ ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ కోహ్లీ ఓ ట్వీట్ చేశారు. 
 
కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో అంబటి రాయుడు స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్నాడు. అంటే.. ప్రపంచ కప్ కోసం ప్రకటించిన క్రికెటర్లలో ఎవరైనా గాయపడితే ఈ స్టాండ్‌బై ఆటగాళ్ళకు అవకాశం దక్కుతుంది. అయితే, బీసీసీఐ సెలెక్టర్లు అంబటి రాయుడు పట్ల కక్షపూరితంగా నడుచుకున్నారు.
 
వరల్డ్‌ కప్ టోర్నీ కోసం ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా సభ్యుల్లో పలువురు క్రికెటర్లు గాయపడినా అంబటి రాయుడుకు మాత్రం పిలుపురాలేదు. పైగా, ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడని కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్‌ను సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అంబటి రాయుడు బుధవారం ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 
 
నిజానికి ప్రపంచకప్‌కు రాయుడు ఎంపిక అవుతాడని అందరూ భావించారు. రాయుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే, ప్రపంచకప్ నుంచి రాయుడిని సెలెక్టర్లు పక్కన పెట్టారు. తొలుత శిఖర్ ధవాన్ గాయపడిన తర్వాత అతని స్థానంలో రిషభ్ పంత్‌ను సెలెక్ట్ చేశారు. అనంతరం విజయ్ శంకర్ కూడా గాయపడ్డాడు. ఈ తరుణంలో కూడా రాయుడిని పక్కన పెట్టి... ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో, మనస్తాపానికి గురైన అంబటి రిటైర్మెంట్ ప్రకటించాడు.