శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2023 (20:53 IST)

వివాహేతర సంబంధం, ప్రేయసి గొంతు కోసి చంపి రాత్రంతా ఇంట్లోనే...

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరిమధ్య ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ తన ప్రేయసిని తన ఇంట్లోనే గొంతుకోసి చంపేసాడు ప్రియుడు. ఆ తర్వాత ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లారేసరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఏలూరులోని దక్షిణపు వీధిలో ఆదివారం రాత్రి సుజాత అనే మహిళను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేసాడు. ఆ తర్వాత అతడు కూడా నూజివీడు రైల్వే స్టేషను సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ సూసైడ్ కేసు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంటి వద్దకు వెళ్లారు. ఇంటి తలుపులు తెరిచే వుండటంతో లోపలికి వెళ్లి చూడగా ఓ మహిళ రక్తపు మడుగులో శవంగా కనిపించింది. ఈ హత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఇది జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరోవైపు మృతురాలి బంధువు, సుజాత ఆదివారం మధ్యాహ్నం ఇంటికెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిందనీ, ఆ తర్వాత షాపుకి రాలేదన్నారు. ఇంటికేమైనా వచ్చిందేమోనని ఆరా తీస్తే అక్కడికి రాలేదని తెలిసింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీనితో తమకు అనుమానం వచ్చి, సత్యనారాయణ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే.... సుజాతకి తనకి గొడవైందనీ, ఆమె గురించి తనకు తెలియదని చెప్పాడు.
 
ఐతే సత్యనారాయణ ఆ రాత్రంతా ఇంట్లోనే వున్నట్లు అనుమానిస్తున్నారు. తెల్లారాక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో సుజాత హత్య బయటకు వచ్చింది. ఈ హత్యోదంతం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.