1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:22 IST)

చైత్ర హత్యాచారం నిందితుడు రాజుది ఆత్మహత్యా? ఎన్‌కౌంటరా? నెటిజన్స్ ఏమంటున్నారో చూడండి

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ఆరేళ్ల బాలిక చైత్ర హత్యాచార నిందితుడు రాజు కోసం గ‌త వారం రోజులుగా తెలంగాణా పోలీసులు వెతుకుతున్నారు. ఐతే అతడు చివ‌రికి రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృత దేహం కనిపించింది.
 
చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
చిన్నారిపై అమానుషంగా హ‌త్యాచారం చేసిన రాజు క‌నిపిస్తే, ఆచూకీ అందిస్తే, 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తిని కూడా తెలంగాణా పోలీసులు ప్ర‌కటించారు. మరోప‌క్క రాజుని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని ప్ర‌జా సంఘాలు, చిన్నారి బంధువులు డిమాండు చేసారు. ఈ ద‌శ‌లో రాజు ప్రాణాల‌తో దొరికి ఉంటే, పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. కానీ, నిందితుడు రైలు ప‌ట్టాల‌పై శవ‌మై క‌నిపించ‌డంతో పోలీసులు ఆత్మ‌హ‌త్య‌ కేసు న‌మోదు చేస్తున్నారు.
 
ఐతే సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శభాష్ తెలంగాణ పోలీస్, బ్రహ్మాండంగా పనిచేసారని కొందరు అంటుంటే, తెలంగాణలో అత్యాచారం చేసినవాడికి శిక్ష వెంటనే పడిపోతుంది మరొకరు కామెంట్ చేసారు. మొత్తమ్మీద నిందితుడిది ఎన్‌కౌంటరా అనే కోణంలో మాట్లాడుకుంటున్నారు.