గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:09 IST)

దసరాకు ఏపీ మంత్రివర్గంలో మార్పులు... ఐదుగురు మంత్రులు ఔట్? ఎవరు వారు? లోకేష్ బాబుకు....

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దసరా నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు క్యాబినెట్‌లో చెలామణి అయినా మంత్రులు ఇక ముందు కొనసాగుతారా... లేదా కొత్తవారికి సిఎం చంద్రబాబు ఛాన

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దసరా నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు క్యాబినెట్‌లో చెలామణి అయినా మంత్రులు ఇక ముందు కొనసాగుతారా... లేదా కొత్తవారికి సిఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠ కొనసాగుతుంది. 
 
మరోపక్క... లోకేశ్ బాబును మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఐటీ శాఖతో పాటు మరో కీలకమైన శాఖను కట్టబెట్టనున్నారు. అందుకు సీనియర్ నేతలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాకతో కొంతమంది సీనియర్లకు చెక్ పెట్టి యువనేత మాట వినే మంత్రులు, ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పగించాలని అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మంత్రివర్గంలో ఎవరికి ఎసరు - ఎవరికి కొసరు?
ఏపీ క్యాబినెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. నూతన మంత్రివర్గంలోకి తీసుకునే కొత్తవారి పేర్లను ఇప్ప‌టికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 11 విజయదశమి నాటికి కొత్త ముఖాల పేర్లను వెల్లడించనున్నారు. ప్రస్తుతం స్పీకర్‌గా కొనసాగుతున్న కోడెల శివప్రసాద్, తన పదవి నుంచి తప్పుకుని మంత్రివర్గంలో చేరనున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సిఎంతో  కోడెల ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచారం. స్పీకర్ స్థానంలో పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేందర్‌ను నియమించనున్నట్టు సమాచారం. 
 
మంత్రి రావెల కిశోర్ బాబు స్థానంలో వేమూరు ఎమ్మెల్యే నాక్క ఆనంద్ బాబును తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మినిస్టర్ కొల్లు రవీంద్ర స్థానంలో జగ్గయ్యపేట శాసనసభ సభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌ని మంత్రివర్గంలోకి ఆహ్వానించనున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణకు సిఆర్‌డిఏ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. 
 
మంత్రివర్గంలో ఇప్పటివరకు దూసుకెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు నిమ్మకాయల చినరాజప్ప పదవుల్లో మార్పులు జరుగనున్నాయి. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన విజయనగరం శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు, కర్నూలు నుంచి భూమా నాగిరెడ్డి లేదా నాగిరెడ్డి కుమార్తె అఖిల , తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూకి చోటు లభించే అవకాశముంది. 20 మందితో ఉన్న ప్రస్తుత మంత్రివర్గాన్ని... 26కు పెంచే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ముద్రగడ వ్యవహారం, కాపు రిజర్వేషన్ల అంశం చిలికిచిలికి గాలివానలా మారుతుండటంతో... జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే... ముద్రగడకు చెక్ పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ముగిసినవి కాబట్టి తన క్యాబినెట్లో కీల‌క మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమందిపై వేటు త‌ప్పద‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా మంత్రుల ప‌నితీరుపై సీఎం చంద్రబాబు... ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు, నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని రెండేళ్లుగా మంత్రులకు సూచిస్తున్నా... పనితీరులో మార్పులేదు. దీంతో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కుల, మత ప్రతిపాదికన తప్పించి వారి స్థానంలో అదే సామాజిక వర్గం వారికి చోటు కల్పించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ప్రస్తుత మంత్రుల్లో ప‌త్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘ‌వ‌రావు, మృణాళిని, పీతాల సుజాతతోపాటు సబ్జెక్టుపై పట్టులేని మరో ఇద్దరు ప‌నితీరుపై తొలి నుంచి సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ప‌ద‌వి హామీ పైనే టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు క్యాబినెట్ విస్తర‌ణపై ఆశలు పెట్టుకొన్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణకు లోకేశ్ బాబుకు ఐటీశాఖ బాధ్యతలతో పాటు సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుకి మంత్రివర్గం, అన్నిశాఖలను సమీక్షించే అధికారం కట్టబెట్టి... జాతీయ రాజకీయాలపై చంద్రబాబు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దఫా జరిగే మంత్రివర్గ విస్తరణ వచ్చే ఎన్నికలు, కుల, మత ప్రతిపాదికన చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.