శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:22 IST)

ఎన్టీఆర్ ప్రారంభించారు.. చంద్రబాబు పూర్తి చేశారు.. ఏంటది?

కరువు ప్రాంతమది. తినడానికి తిండి లేక గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్ళిపోతున్న వైనం. పంటలు పండిచాలంటే సాగునీరు అంతంతమాత్రం. తాగడానికి నీరు లేదు. అలాంటి గ్రామస్తులకు ఒక ప్రాజెక్టు కల్పతరువుగా మారింది. అదే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన ప్రాజెక్టు. లక్షలమంది ప్రజలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారా అందనుంది. 
 
ఎన్నో యేళ్ళ రైతుల కళ. నేటికి సాకారమైంది. చేతికి వచ్చే పంటలు సాగునీరు లేక ఎండిపోయి అప్పులు చేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో. గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న కరువును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు దివంగత నేత నందమూరి తారకరామారావు ప్రారంభించిన హంద్రీ - నీవా ప్రాజెక్టు ద్వారా రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. 
 
కారణం చిత్తూరు జిల్లాలో లక్షా 40వేల ఎకరాలకుపైగా సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందడమే. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును పూర్తి చేశారు. కరువుతో గ్రామాలు గ్రామాలు వలసలు వెళ్ళే పరిస్థితి ఇక ఉండదు. పంటలు పండించాలా వద్దా అన్న ఆలోచనను పూర్తిగా రైతులు మానుకోనున్నారు. ఇదంతా ఒక్క హంద్రీ - నీవా ప్రాజెక్టు వల్లే సాకారమైంది. 
 
చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించడంలో అవరోధాలు తొలగిపోయాయి. అనంతపురం జిల్లా కదిరి శివారులోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు రెండు రోజుల క్రితం నీటిని వదలడంతో.. త్వరలోనే జిల్లాకు చేరనున్నాయి. దీంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి సాకారం దిశగా పెద్ద ముందడుగు పడినట్లైంది. కర్నూలు జిల్లాలోని హంద్రీ నది నుంచి.. చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించాలన్న బృహత్‌ సంకల్పంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు అనేక అవరోధాలను అధిగమించింది.
 
చెర్లోపల్లి నుంచి ప్రయోగాత్మకంగా నీటిని వదలడంతో.. మరో రెండు రోజుల్లోనే జిల్లా  సరిహద్దుల్లోకి చేరుకుంటాయని మంత్రి అమరనాథరెడ్డి కూడా బైరెడ్డిపల్లెలో  ప్రకటించారు. పెద్దతిప్పసముద్రం మండలంలో.. స్వాగత కార్యక్రమానికి భారీగా రైతులు హాజరు కావాలని కూడా పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఇక్కడి నుంచి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌గా మారుతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరి సమీపంలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. 
 
ఈ మార్గంలో 8 మంది లిప్టుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. చెర్లోపల్లి పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. పక్షం రోజుల క్రితమే ఇక్కడి నుంచి దిగువకు నీటిని వదలాలని జలవనరుల శాఖ నిర్ణయించినా.. అనుకోని అవరోధాలతో ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో పలుచోట్ల ప్రధాన కాల్వలకు గండ్లు కొట్టడంతో ప్రవాహం తగ్గిపోయింది. తాజాగా ఆ మరమ్మతులన్నీ పూర్తిచేసి.. పై నుంచి సరఫరా పెంచడంతో పుంగనూరు బ్రాంచికి జలకళ వచ్చింది. 
 
మరోపక్క, చెర్లోపల్లి నుంచి మన జిల్లా సరిహద్దుల్లోని పీటీఎం వరకు 26వ ప్యాకేజీ కింద పనులు పూర్తయ్యాయి. ట్రయల్‌ రన్‌గా సుమారు 150 క్యూసెక్కుల నీటిని రెండు రోజుల క్రితమే వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విడుదల చేస్తారు. తొలుత పీటీఎం చెరువు నింపిన తర్వాత కిందికి వదులుతారని తెలుస్తోంది. ఈ దఫాలో జిల్లాకు 1.2 టీఎంసీల నీటిని తరలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి అవసరాలు తీరేలా మదనపల్లె డివిజన్‌లోని చిప్పిలి, గుంటివారిపల్లె, వ్యాససముద్రం, పెద్దతిప్పసముద్రం, పుంగనూరు చెరువులను నింపనున్నారు. ఎపి ప్రభుత్వం దిగ్విజయంగా ప్రాజెక్టును పూర్తి చేయడంతో 30వేలమందికి పైగా రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్థమయ్యారు.