శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (17:00 IST)

అరుణ్ జైట్లీ జీవిత విశేషాలు.. న్యాయవాది.. మంచి మనసున్న వ్యక్తి.. (video)

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మృతి చెందారు. కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జైట్లీ తుదిశ్వాస విడిచారు. న్యాయవాదిగా మంచి మనసున్న వ్యక్తిగా ముద్రవేసుకున్న అరుణ్ జైట్లీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.. 
 
అరుణ్‌ జైట్లీ 1952లో మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రతన్‌ ప్రభు దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి కిషన్‌ స్వస్థలం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌. ఆయన అక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగిన న్యాయవాది‌. తల్లి రతన్‌ ప్రభుది పంజాబ్‌లోని అమృత్‌సర్‌. 
 
దేశవిభజన సమయంలో కిషన్‌ జైట్లీ ఢిల్లీకి నారాయణ్‌ విహార్‌కు వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అక్కడే అరుణ్‌జైట్లీ జన్మించారు. జైట్లీ విద్యాభ్యాసం మొత్తం మంచి పేరున్న విద్యాలయాల్లోనే జరిగింది. సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌, శ్రీరామ్‌ కామర్స్‌ కాలేజ్‌, లా విద్యాభ్యాసం ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివారు. 
 
ఢిల్లీలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో జైట్లీ కూడా ఒకరు. పన్ను చట్టాలు, ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. కోర్టులో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారని పేరు. కానీ, తన గుమాస్తాల విషయంలో మాత్రం జైట్లీ ఎంతో ఉదారంగా ఉండేవారు. 
 
ప్రతి కేసులోను ప్లీడర్‌ గుమాస్తాలకు ఇచ్చే ఖర్చులను నేరుగా వారికే ఇప్పించేవారు. దీంతో పాటు వారి సిబ్బంది పిల్లల చదువులకు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసేవారు. సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు దిల్లీలోని ఇంటిని వేదికగా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా మంచి మనసున్న వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు.
 
అలాగే 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
రాజ్ నారాయణ్, జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేకగా ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక భూమిక పోషించారు. 
అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. 
జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీలో చేరారు.  
 
1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 
1990లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. 
వీపీ సింగ్ హయాంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్‌గానూ సేవలందించారు జైట్లీ.
1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. 
 
1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
2000లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. 
2002లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా 
2003లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రగానూ పనిచేశారు.
 
2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో ఆయన తిరిగి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 
2009 రాజ్యసభలో విపక్ష నేతగా ఎంపికయ్యారు జైట్లీ.  
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రక్షణ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.
1980 నుంచి బీజేపీలో ఉన్న అరుణ్ జైట్లీ ఒకే ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు. 
 
2014లో అమృత్‌సర్ లోక్‌సభ నియోజవర్గంలో పోటీచేసిన ఆయన అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు.
ఆరోగ్య కారణాల దృష్ట్యా 2019 లోక్‌సభ ఎన్నికల విజయం తర్వాత కేంద్రం మంత్రివర్గానికి ఆయన దూరంగా ఉన్నారు.