తట్టలో వేసి... బుట్టలో వేసి.... చాగంటికి చంద్రబాబు ట్రాప్.. ఎలగెలాగా...?!!!
చాణక్యుడికి ఉన్నంత పేరు రాజకీయాల్లో చంద్రబాబుకు ఉంది. ఆయన తిమ్మినిబమ్మిని చేయగలడు. యాంటీని... ఏంటి అని ప్రశ్నించగలరు. తనకు అనుకూలంగా మార్చుకోగలరు. అందుకే చంద్రబాబు ఎదుట రాజకీయంలో నిలబడటం అంత తేలిక కాదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.
చాణక్యుడికి ఉన్నంత పేరు రాజకీయాల్లో చంద్రబాబుకు ఉంది. ఆయన తిమ్మినిబమ్మిని చేయగలడు. యాంటీని... ఏంటి అని ప్రశ్నించగలరు. తనకు అనుకూలంగా మార్చుకోగలరు. అందుకే చంద్రబాబు ఎదుట రాజకీయంలో నిలబడటం అంత తేలిక కాదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... చంద్రబాబు ఇటీవల ఉగాది ఉత్సవాల్లో ప్రదర్శించిన చాణక్యం అంతా ఇంతా కాదు. అపర వ్యాసుడిలా ప్రవచనాలు వల్లించి, జనాన్ని మంత్రముగ్ధుడిని చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటిని... తట్టలో వేసి... బుట్టలో వేసి.... చంద్రబాబు ట్రాప్ చేసేశారు. ఏంటీ ట్రాప్ అనుకుంటున్నారా...?
కులాల కుంపటిలో... ఏపీ!
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు లేవు... విధులు లేవు కానీ, కులాల కుంపట్లు మాత్రం... రోహిణికార్తె ఎండలా రాజుకున్నాయి. ఒకపక్క దళిత ఉద్యమాలు ఉండనే ఉన్నాయి. తాజాగా కాపు ఉద్యమం అంటూ, రాజకీయ ముసలం బయలుదేరింది. ఈ దశలో మా సంగతి ఏంటని బ్రాహ్మణులతోపాటు అన్ని కులాల వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో సీఎం చంద్రబాబు కులాల కుంపట్లతో విసిగిపోతున్నారు. అందుకే ప్రతి సమావేశంలో ఈ మధ్య... కులాలు రెండే... ఒకటి ధనికులు, రెండోది పేదలు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
కానీ, ఎక్కడికక్కడ కులాలను తనదైన శైలిలో బ్యాలెన్స్ చేస్తున్నారు. కాపు నేత ముద్రగడను దెబ్బతీసేందుకు పవన్ కల్యాణ్తోపాటు పలువురు కాపు ప్రముఖులను దువ్వుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు ఒక పెద్ద తురుపు ముక్కలా... ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు కనిపించారు. కులాలకు అతీతంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఆయన సభలకు ఇసుక వేస్తే, రాలనంత జనం వస్తున్నారు.
అంతకు వందరెట్ల మంది ఇళ్ళలో ఉండే... టీవీ ఛానళ్ల ద్వారా చాగంటి చెప్పేది... చెవులు అప్పగించుకుని వింటున్నారు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని ఊరికినే వదిలేస్తే... చంద్రబాబు ఎందుకు అవుతారు... మా మంచి బాబే?
చాగంటిని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటాం...
ఉగాది పురస్కారాలకు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఎంపిక చేశారు. ఆయన విజయవాడలో ఉగాది సంబరాలకు రాగానే, మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నాం... అని చెవిలో చల్లగా ప్రవచనం చెప్పారు. మీరు కాదనకూడదు అని చెప్పేశారు. అదీ జనం మధ్యలో. ఆయన ఇంకేమంటారు... ఓకే అనేశారు. అంతే, ఉగాది వేదికపై సీఎం చాగంటిని రాష్ట్ర ప్రభుత్వం... పాజిటివ్ థింకింగ్కి వాడుకుంటుందని... ఆయన ప్రభుత్వ సలహాదారుగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి... ప్రజల్ని చైతన్యపరుస్తారని ప్రకటించారు.
ఇప్పుడు చాగంటి చేస్తున్నది అదేగా... అటు తెలంగాణాలో ఇటు ఆంధ్రాలో ప్రవచనాలు చెపుతూ... అనే సందేహం రావొచ్చు. ఇప్పటి దాకా ఆయన చేసింది వేరు... ఇపుడు ఏపీ ప్రభుత్వం ఉపయోగించే తీరు వేరు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పనికీ ప్రచారకర్తగా చాగంటిని వినియోగించుకుంటారు. ఎవరు చెప్పినా వినరేమో గాని, చాగంటి చెపితే సరే... అని పరిస్థితులు తెలుగు ప్రజల్లో ఉన్నాయి. దీనిని వాడుకోవడమే చంద్రబాబు చాణక్యం. ఉగాది నాటి సీఎం నిర్ణయంతో... యావత్ కుల సమీకరణలు పటాపంచలు... బ్రాహ్మణులు ఒక్కరే కాదు... దాదాపు అన్ని వర్గాల వారూ చాగంటి ద్వారా టీడీపీ ప్రభుత్వం వైపునకు వచ్చేసినట్లే... అదీ చంద్రబాబు లెక్క. ఇక వారి వాడకం ఎలా ఉంటుందో... చాగంటి గారూ చూడండి.