శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 28 ఏప్రియల్ 2018 (19:42 IST)

చిరంజీవి 'తమ్ముడు' జనసేనానితోనేనా...?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. గత ఎన్నికల్లో తను అధికారంలోకి తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు ఆయన ప్రధాన శత్రువుగా మారింది. తాజాగా జరిగిన పరిణామాలు పవన్‌కు చాలా స్పష్టత తీసుకొస్తున్నాయి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. గత ఎన్నికల్లో తను అధికారంలోకి తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు ఆయన ప్రధాన శత్రువుగా మారింది. తాజాగా జరిగిన పరిణామాలు పవన్‌కు చాలా స్పష్టత తీసుకొస్తున్నాయి. రాజకీయాలకు కొత్తయిన పవన్ కళ్యాణ్‌ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను చూసి ఒకవిధంగా ఖిన్నుడవుతున్నాడట. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సలహా మేరకు శ్రీరెడ్డి పవన్ పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంగా మారాయి. శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడానికి తనే కారణమని వర్మ అంగీకరించినప్పటికీ పవన్ మరో సంచలన కోణాన్ని బయటపెట్టారు.
 
అమరావతి కేంద్రంగా ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ తనపై కుట్రలు చేస్తున్నారని పవన్ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దర్శకుడు వర్మ ఒక టివి ఛానల్లో కలిసి లోకేష్ తనపై బురద చల్లుతున్నారని, ఇందుకోసం శ్రీరెడ్డిని ఉపయోగించుకున్నారన్నది పవన్ ఆరోపణ. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన చేతిని చంపేయడానికి సిద్థమయ్యారని పవన్ తీవ్రమైన ఆవేదనతో వ్యాఖ్యానించారు.
 
ఈ క్రమంలోనే పవన్ సహా మెగా ఫ్యామిలీ అంతా ఫిలిం ఛాంబర్‌కి చేరుకుంది. తనను దూషించే శ్రీరెడ్డిని ప్రేరేపించిన దర్శకుడు వర్మపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో ఉదయం నుంచి ఛాంబర్లోనే కూర్చున్నారు. ఇదంతా తెలిసిందే. అయితే తెలుగు సినిమా రంగంలో లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశం జరిగితే ఆ సమావేశానికి చిరంజీవి హాజరు కాలేదు.
 
చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. గణనీయమైన ఓట్లు వచ్చాయి. 18 సీట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన పార్టీని కొనసాగించలేదు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. ఇదిలాఉంటే గత ఎన్నికలకు మునుపు రాష్ట్ర విభజన జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమనే పేరుతో రాష్ట్రంలో ఆ పార్టీని జనం తుడిచిపెట్టేశారు. 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలువలేదు. ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నామమాత్రం అయ్యింది. అప్పటి నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి. 
 
ఆయన సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశంతో విభేదించి బహిరంగంగా విమర్శలు మొదలుపెట్టారు. దీంతో టిడిపి కూడా ఆయనపై విమర్శలు చేయడం ప్రారంభించింది. బిజెపి అండతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని దేశం నాయకులు విమర్శిస్తుంటే తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా ఉన్న మీడియా సహాయంతో తన వ్యక్తిత్వంపైన బురద జల్లుతోందని పవన్ మండిపడుతున్నారు.
 
పవన్ పైన జరుగుతున్న దాడిని చూసి మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కటయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంచో చెడ్డో తమ కుటుంబ సభ్యుడు రాజకీయంగా చాలా ముందుకు వెళ్ళిపోయిన తరుణంలో కుటుంబ కలహాలతో విభేదించుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ వపన్‌కు అండగా నిలవాలన్న నిర్ణయానికి మెగా కుటుంబం వచ్చినట్లు సమాచారం. ఏమైనా చిరంజీవి రాజకీయ భవితవ్యం ఏమిటో త్వరలోనే చెబుతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే మొన్న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన సమావేశానికి చిరంజీవి హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. 
 
చిరంజీవి జనసేనతోనే జతకడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ బలం రెట్టింపు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి ఆ తరువాత జెండా పీకేశారన్న కోపం అభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ అది తాత్కాలికమేని తెలుస్తోంది. చిరంజీవి వస్తే ఖచ్చితంగా జనం ఆయన్ను మళ్ళీ రాజకీయంగా ఆదరిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.