శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (16:34 IST)

ఫ్రెండ్లీ పోలింగ్‌పై విమర్శలు.. సహనం కోల్పోతున్న ఖాకీలు

హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలింగ్‌పై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అనేకమంది పోలీసులు సహనం కోల్పోయి నిందితులపై బహిరంగంగానే చేయి చేసుకుంటూ విమర్శలపాలవుత

హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలింగ్‌పై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అనేకమంది పోలీసులు సహనం కోల్పోయి నిందితులపై బహిరంగంగానే చేయి చేసుకుంటూ విమర్శలపాలవుతున్నారు. తద్వారా పోలీసు శాఖ పరువును బజారుకీడుస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఉన్నతాధికారులనూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 
 
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ మంచి సత్ఫలితాలనిస్తుందని చెప్పొచ్చు. ప్రమాదాల నివారణకు రాత్రంతా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. కానీ... మందుబాబులతో ఓపికగా వ్యవహరించాల్సిందిపోయి వారిని చితకబాదుతూ వివాదాల్లో చిక్కుతున్నారు. ఇటీవల కనీస విచక్షణ మరిచిన ఇద్దరు హోంగార్డులు అందరు చూస్తుండగానే ఓ మందుబాబును కాళ్లతో తన్నుతూ, వీపుపై పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు హోంగార్డులపై బదిలీవేటు పడినా.. మందుబాబులతో పోలీసులు ప్రవర్తించిన తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. 
 
అలాగే, లా అండ్ అర్డర్ పోలీసులు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఇటీవలే జాతీయ స్థాయి పురస్కారం పొందిన బేగంపేట్ ఏసీపీ రంగారావు మహిళా దొంగలతో వ్యవహరించిన తీరుపై చూసి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఫలితంగా ఒక్కరోజు వ్యవధిలోనే సిటీ ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. బంగారం దొంగిలించిన మహిళా నిందితుల్ని అరెస్టు చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టిన ఏసీపీ రంగారావ్... రికవరీ విషయంలో పోలీసులను ముప్పతిప్పలు పెడుతోందంటూ సహనం కోల్పోయారు. అందరు చూస్తుండగానే సదరు మహిళా దొంగ చెంపఛెళ్లుమనిపించారు. 
 
ఇకపోతే, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్ తీరు ఉన్నతాధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. భర్త చనిపోయిన ఓ బాధితురాలింటికి వెళ్లిన సీఐ వివరాలు సేకరిస్తూ బాధిత మహిళా కూర్చున్న మంచంపై కాలు పెట్టి రాజసం ప్రదర్శించారు. ఆ ఫోటో కాస్త వైరల్ కావడంతో మరో చోటికి బదిలీచేశారు. కుర్చీ విరిగిన కారణంగా కాలు పెట్టానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
అలాగే, పోలీస్ శాఖలో మంచి అధికారిణిగా గుర్తింపు పొందిన ఏసీబీ అదనపు ఏస్పీ సునీతారెడ్డి.. అదే శాఖలోని మల్లిఖార్జున్‌ రెడ్డి అనే ఇన్స్‌పెక్టర్‌తో సన్నిహితంగా ఉన్నపుడు ఆమె భర్త రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత సునీతారెడ్డి బంధువులు సీఐని చితకబాదటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండే హైదరాబాద్‌లోనే మచ్చుకు కొన్ని ఘటనలు బయటపడగా వెలుగులోకిరాని అంశాలు మరెన్నో.. మరి జిల్లాల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.