శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (13:05 IST)

ఇక బీజేపీలో దూరిపోదాం... సిద్ధంగా ఉండండి... అనుచరులతో మాజీ సిఎం కిరణ్‌

కేంద్రానికి, ఏపీకి మధ్య జరుగుతున్న ప్రత్యేక హోదా రగడ మొత్తం మీద మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కలిసొస్తోంది. ఎప్పటి నుండో బిజెపిలో చేరాలన్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరిక మరికొన్ని రోజుల్లో నె

కేంద్రానికి, ఏపీకి మధ్య జరుగుతున్న ప్రత్యేక హోదా రగడ మొత్తం మీద మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కలిసొస్తోంది. ఎప్పటి నుండో బిజెపిలో చేరాలన్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరిక మరికొన్ని రోజుల్లో నెరవేరనుంది. కిరణ్‌ తన సన్నిహితులతో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారట. అన్నింటికీ సిద్ధంగా ఉండండి.. ఏ క్షణమైనా వెళ్లిపోదామంటూ ఆనందంతో ఊగిపోయారట. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంత సంతోషంగా ఉండడానికి కారణం తెదేపా, బీజేపీకి మధ్య ఉన్న బంధం తెగిపోవడానికి సిద్ధంగా ఉండడమే.
 
నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి. తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిన ఘనుడు. ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్‌గా మాత్రమే పనిచేసిన అనుభవం ఉన్న కిరణ్‌కు అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్టానం సీఎం పోస్టునే ఇచ్చేసింది. కారణం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చనిపోవడం, ఆ తరువాత రోశయ్య సీఎం కావడం, నా వల్ల కాదంటూ రోశయ్య రాజీనామా చేయడం ఇదంతా జరిగిన తర్వాత పార్టీలో ఎవరు ఉత్సాహంగా పనిచేస్తారని వెతుకుతున్న సమయంలో కిరణ్‌ కాంగ్రెస్‌కు కనిపించాడు. ఇంకేముంది అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సీఎం పదవి ఇచ్చేశారు. కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నా రాష్ట్ర విభజన అంశం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఒక్కవూపు ఊపింది. అంతేకాదు సీఎం పదవికే ముప్పు తెచ్చి పెట్టింది. అందుకే ఏకంగా సీఎం పదవికి రాజీమానా చేసి సైలెంట్‌ అయిపోయారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీమానా చేశారు కూడా. ఇంతటితో ఆగలేదు. సొంతంగా పార్టీ పెట్టేశారు కూడా. జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు. అయితే జైసపాకు ఎక్కడ కూడా ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. పార్టీ కాస్త మరుగునపడిపోయింది. అక్కడక్కడ జైసపా నాయకులు ఆందోళనలు చేశారు కానీ, ఆ తర్వాత మిన్నకుండి పోయారు. కిరణ్‌ కూడా పార్టీని వదిలి తన సొంత బిజినెస్‌లో పడిపోయారు. 
 
సొంత నియోజకవర్గం వాయల్పాడుతో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చారు. ఎక్కువగా ఆయన బెంగుళూరులోనే గడిపారు. ఇదంతా బాగానే ఉన్నా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నా ఆలోచన కిరణ్‌లో మొదలైంది. అది కూడా ప్రస్తుతం ఉన్న పార్టీలోనే చేరాలన్న ఆలోచన. చంద్రబాబంటే అసలు పడని కిరణ్‌ వైసీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగింది. కిరణ్‌కు చంద్రబాబంటే ఎంత కోపమో.. వై.ఎస్‌.జగన్ అంటే అంతేకోపం. అందుకే ఆయన ఏ పార్టీలో చేరలేదు. చివరకు బీజేపీలోకి వెళ్ళాలని భావించారు.
 
అయితే అక్కడే అసలైన చిక్కొచ్చిపడింది. బీజేపీకి, తెలుగుదేశంపార్టీకి మధ్య ప్రస్తుతం స్నేహబంధముంది. అలాంటి పరిస్థితిలో బీజేపీలో చేరడం కష్టమే. కాబట్టి వీరి మధ్య ఆ సఖ్యత పోయిన తరువాత చేరుదామని భావించి కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. అనుకున్న విధంగా ప్రస్తుతం ఆ సమయం కూడా కిరణ్‌కు వచ్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై తెదేపా, బీజేపీలకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక విడిపోవడానికి సిద్ధంగానే ఉన్నారని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు.
 
ఇదంతా చూస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆనందానికి అవధుల్లేవు. ఎగిరి గంతేశారట. రెండురోజుల క్రితం తన సన్నిహితులతో వాయల్పాడులోని తన సొంత ఇంటిలో సమావేశమైన కిరణ్‌.. బీజేపీకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండడంటూ చెప్పుకొచ్చారట. ఎప్పుడూ కిరణ్‌ ముఖంలో ఆనందం చూడలేదని ఆయన సన్నిహితులో చెప్పుకుంటుండడం గమనార్హం. మొత్తం మీద రాష్ట్ర విభజన రాజకీయాల నుంచి కిరణ్‌ను దూరం చేస్తే ప్రత్యేక హోదా కిరణ్‌ను మళ్ళీ రాజకీయాల్లో తీసుకువస్తోంది.