గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Updated : శనివారం, 6 మే 2017 (20:59 IST)

స్వచ్ఛభారత్‌లో తిరుపతికి 9వ స్థానం ఎలా వచ్చిందో తెలుసా?

ఆధ్మాత్మిక నగరం తిరుపతి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా దేశంలోనే శుభ్రతను పాటిస్తున్న నగరాల్లో 9వ స్థానాన్ని దక్కించుకుంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల

ఆధ్మాత్మిక నగరం తిరుపతి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా దేశంలోనే శుభ్రతను పాటిస్తున్న నగరాల్లో 9వ స్థానాన్ని దక్కించుకుంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన వినయ్ చంద్ అవార్డును అందుకున్నారు. 
 
తిరుపతి అంటేనే వెంటనే గుర్తుకువచ్చేది ఏడుకొండలవాడు. నిత్యం లక్షలాదిగా వెంకన్నను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు భక్తులు. రోజురోజుకు అభివృద్థి చెందుతున్న తిరుపతి మహానగరం ఆధ్మాత్మిక క్షేత్రంగానే కాకుండా అన్ని రంగాల్లోను దూసుకుపోతోంది. ముఖ్యంగా పారిశుధ్యానికి తిరుపతిలో పెద్దపీట వేస్తున్నారు అధికారులు. తిరుపతిలో నగర పాలక సంస్థ అధికారులు అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 
 
గతంలో ఉన్న తిరుపతికి, ప్రస్తుతం ఉన్న తిరుపతికి చాలామార్పులు చోటుచేసుకున్నాయంటున్నారు భక్తులు. బస్టాండ్, రైల్వేస్టేషన్ మొదలు అనేక ప్రదేశాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి పారిశుధ్యంలో దేశంలో తొమ్మిదవ స్థానం దక్కడం వెనుక అధికారుల కృషి ఎంతో ఉంది. తిరుపతిని స్మార్ట్ సిటీగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు మున్సిపల్ సిబ్బంది. గతంలో అస్తవ్యస్థంగా ఉన్న అండర్ డ్రైనేజీలు బాగుచేయడం మొదలు బహిరంగ మలమూత్ర విసర్జనను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 
 
భక్తులు ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్ళు, వసతి సముదాయాల వద్ద ఇ-టాయ్‌లెట్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. దీంతో ఒకప్పుడు దుర్గందం వెదజల్లే బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లు మొదలు అనేక ప్రాంతాలు ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్‌గా మారాయి. గతంలో డంపింగ్ యార్డులుగా దర్శనం ఇచ్చిన ఖాళీ ప్రదేశాలను పార్కులుగా తీర్చిదిద్దారు. చెత్తాచెదారంతో ఒకప్పుడు తాండవించిన నగర వీధులు ప్రస్తుతం క్లీన్ అండ్ గ్రీన్‌గా మెరిసిపోతున్నాయి. అధికారులు, ప్రజలు సమిష్టి కృషి వల్లే దేశంలోనే 9వ స్థానంలో స్వచ్ఛ తిరుపతి అవార్డును సాధించగలిగామన్నారు ప్రస్తుత నగర పాలక సంస్థ కమిషనర్ మాధవీలత.
 
స్వచ్ఛ తిరుపతిగా కేంద్ర అవార్డు సాధించడంతోనే తృప్తి పడబోమని, తిరుపతిని మరింత అందమైన నగరంగా తీర్చిదిద్దేవరకు తమ కృషి కొనసాగుతుందంటున్నారు అధికారులు. దేశంలోనే అత్యంత పారిశుధ్య క్షేత్రంగా రికార్డులోకెక్కిన తిరుమలతో సమానంగా తిరుపతిని కూడా తీర్చిదిద్దుతామని అధికారులంటున్నారు. అంతేకాదు దేశంలో నెం.1 స్థానాన్ని సాధించిన ఇండోర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు.