గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (09:50 IST)

పడిపోతున్న మోడీ గ్రాఫ్... కమలానికి గడ్డు రోజులు...?

2014 ఎన్నికలకు ముందు వెలిగిపోయిన ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక గ్రాఫ్ పడిపోతోంది. ఫలితంగా కమలానికి గడ్డు రోజులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. పైగా, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' న

2014 ఎన్నికలకు ముందు వెలిగిపోయిన ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక గ్రాఫ్ పడిపోతోంది. ఫలితంగా కమలానికి గడ్డు రోజులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. పైగా, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' నినాదంతో దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలన్న కమలనాథుల కల... 'పగటి కల'గానే మిగిలిపోయేలా ఉంది.
 
గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఉప ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా విపక్ష కూటమి అభ్యర్థులే విజయభేరీ మోగించారు. దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ అతి కష్టంమీద ఒక స్థానం గెలుచుకోగా, ఆ పార్టీ భాగస్వామ్యపక్షం మరో సీటులో గెలిచింది. అంటే మూడు సిట్టింగ్ స్థానాలకు ఒక్క స్థానం మాత్రమే నిలుపు కోగలిగింది. మిగిలిన రెండు స్థానాలూ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేజిక్కించుకున్నాయి. 
 
ఇక 10 అసెంబ్లీ సీట్లలో ఒక్కటంటే ఒక్కదాంట్లో గెలుపొందింది. బీహార్‌లో బీజేపీ - జేడీయు కూటమికి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఆర్జేడీ అభ్యర్థికి విజయాన్ని అందించారు. కర్ణాటకలో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం పెరిగినట్లయ్యింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, జార్ఖండ్‌లో జేఎంఎం అభ్యర్ధులు గెలుపొందారు. మేఘాలయాలో కూడా కాంగ్రెస్సే గెలిచింది. మొత్తం మీద ఏతా వాతా బీజేపీకి ఈ ఎన్నికలు ఒక వార్నింగ్ లాంటివి.
 
బీజేపీని ఎదిరించే విపక్షాలన్నీ ఇకపై ఒక్క తాటిపైకి వస్తే.. ఏ జరుగనుందనడానికి సూచిక ఈ ఎన్నికలు. మొత్తంమీద దేశవ్యాప్తంగా కమలానికి ఎదురు గాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' సాధన పేరుతో గత కొంతకాలంగా అమిత్ షా, మోడీ ద్వయం దేశవ్యాప్తంగా ముమ్మరంగా తిరుగుతోంది. ఈ ప్రయత్నం అంతా వృథా ప్రయాసేననే సంకేతాలు వెలువడుతున్నాయి. మరో యేడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కమలనాథుల్లో ఈ ఫలితాలు టెన్షన్ పెంచుతున్నాయి.