గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:39 IST)

'మెర్సల్' స్ఫూర్తితో పవన్ కళ్యాణ్... 'ప్రత్యేక హోదా'పై చిత్రం అదిరిపోతుందా?

మెర్సల్ చిత్రంలో రెండే రెండు చిన్న పాయింట్ల పైన విజయ్ మాట్లాడుతాడు. ఆ చిత్రంలో జీఎస్టీ పన్నురేటుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. దీనికే భాజపా శ్రేణులు మండిపడ్డాయి. సినిమాలో చూపించినవి అవాస్తవమంటూ ఆక్షేపించాయి. తమిళనాడులో ఈ చిత్రానికి అక్కడి ప్రజలు జేజే

మెర్సల్ చిత్రంలో రెండే రెండు చిన్న పాయింట్ల పైన విజయ్ మాట్లాడుతాడు. ఆ చిత్రంలో జీఎస్టీ పన్నురేటుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. దీనికే భాజపా శ్రేణులు మండిపడ్డాయి. సినిమాలో చూపించినవి అవాస్తవమంటూ ఆక్షేపించాయి. తమిళనాడులో ఈ చిత్రానికి అక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్లందరూ మెర్సల్ చిత్ర బృందానికి అనూహ్యంగా మద్దతు ఇస్తున్నారు. చివరికి సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం మెర్సల్ చిత్రం బృందానికి తన మద్దతు ప్రకటించారు. దీనితో భాజపా శ్రేణులు ఒకింత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అదలావుంటే ఇప్పుడు ఏపీలో ఓ టాక్ వినిపిస్తోంది. తిరుపతి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలో వచ్చాక ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంతో ఢీకొడితే వచ్చే నిధులు కూడా రాకుండా పోతాయన్న భయంతో అధికార పార్టీ వచ్చినదానితోనే నెట్టుకొస్తోంది. 
 
ఐతే దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాచి పోయిన లడ్డూలు చేతిలో పెట్టారంటూ ధ్వజమెత్తారు. దక్షిణాదిలో వున్న తాము ప్రధానమంత్రి మోదీకి కనబడటం లేదేమో అంటూ గట్టిగా నినాదాలు కూడా చేశారు. ఐతే కేంద్రం మాత్రం ప్రత్యేక హోదాపై తమ స్టాండును ప్రకటించేసింది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొందరు ప్రత్యేక హోదా ముగిసిన ఓ అధ్యాయం అని ముక్తాయింపు ఇచ్చేశారు. ఈ నేపధ్యంలో ఇటు జనసేన, అటు జగన్ పార్టీ వైసీపి మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి.
 
ప్రత్యేక హోదా కోసం జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన పాదయాత్రతో ప్రారంభమవుతుంటే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం మెర్సల్ స్ఫూర్తితో ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజకీయ వ్యవస్థపై బాణాలు ఎక్కుపెట్టే దిశగా ఓ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే ఏపీలోనూ రాజకీయ సెగలు తప్పవు. వచ్చే ఎన్నికల్లో ఇది అధికార పార్టీకి ఇబ్బందులను సృష్టించే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందో?