గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (18:21 IST)

హెరిటేజ్ నాది.. తెల్ల కాగితాలపై బాబు సంతకాలు చేయించుకుని?: మోహన్ బాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తనతో పాటు దాగా అనే మరో మిత్రుడు, చంద్రబాబు కలిసి హెరిటేజ్‌ని స్థాపించామని.. కానీ అధిక పెట్టుబడి తానే పెట్టానని.. మిగిలిన ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని తన వాటాను కొట్టేశారని మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇంకా తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారన్నారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని వెల్లడించారు. 
 
కొన్నేళ్ల తర్వాతే తనకు హెరిటేజ్‌ సంస్థతో సంబంధం లేదనే విషయం తెలిసిందన్నారు.  ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ... ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు నిలదీశారు. 
 
పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని మోహన్ బాబు చెప్పారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.