శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (12:41 IST)

సీనియర్లను అడ్డంగా తొక్కేస్తున్న మోడీ :: అద్వానీ నుంచి వెంకయ్య వరకు అదేతీరు...

నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన హవాను కొనసాగిస్తున్నారు. ఒక నేత.. తనను మించిపోతున్నారనీ భావిస్తే అతన్ని అడ్డంగా తొక్కేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయ

నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన హవాను కొనసాగిస్తున్నారు. ఒక నేత.. తనను మించిపోతున్నారనీ భావిస్తే అతన్ని అడ్డంగా తొక్కేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇపుడు తన మంత్రివర్గంలో కీలకంగా ఉన్న అత్యంత సీనియర్ నేత అయిన ఎం. వెంకయ్య నాయుడు విషయంలోనూ అదే జరిగింది. తద్వారా మాజీ ప్రధాని వాజ్‌‍పేయి వారసులను, తనకు పక్కలో బల్లెంలా మారుతున్నట్టు కనిపించే నేతలను ఏమాత్రం కనికరం లేకుండా అడ్డంగా తొక్కేస్తున్నారు.
 
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అనేక మంది సీనియర్ నేతలు ఓ వెలుగు వెలిగారు. ఇలాంటివారంతా ఇపుడూ ఉన్నారు. కానీ, నామమాత్రంగా తమపని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మరికొందరు తమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇలాంటివారిలో పార్టీకి తన జీవితాన్నే ధారపోసిన పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీని తొలుత చెప్పుకోవచ్చు. ఈయనను ఇంటికే పరిమితం చేశారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రపతి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అద్వానీని ఎపుడో సమసిపోయిన బాబ్రీ మసీదు కేసు విచారణ తెరపైకి తెచ్చి.. కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారనే వాదన లేకపోలేదు.  
 
మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషీది ఇదే పరిస్థితి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే 75 యేళ్లు దాటిన నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఉమాభారతి పరిస్థితి అంతే... తన గురువు అద్వానీకి ఎదురైన పరిస్థితిని చూస్తూ మిన్నకుండిపోయారు. పైగా, ఆమెకు అప్రధాన్య శాఖను మోడీ కట్టబెట్టి మరోమాట మాట్లాడకుండా చేశారు. మరో సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్. ఈమె పేరుకే విదేశాంగ మంత్రి. కానీ, మోడీయే ప్రపంచాన్ని చుట్టేస్తూ.. అన్ని దేశాలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. దీంతో సుష్మాస్వరాజ్ విదేశాల్లో చిక్కుల్లో ఉన్న భారతీయుల వివరాలను తెలుసుకుని ట్విట్టర్ వేదికగా తన వంతు సాయం చేస్తున్నారు. 
 
అలాగే, గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్‌ మంచి పాలనాదక్షుడు మాత్రమే కాకుండా సచ్ఛీలుడు అనే ముద్రవుంది. ఆయనతో సీఎం పదవికి రాజీనామా చేయించి తన మంత్రివర్గంలో అత్యంత కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల రక్షణ శాఖకు రూ.కోట్లు నిధులు మిగులు చూపించారు. అంతేనా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి శత్రుదేశమైన పాకిస్థాన్‌కు హెచ్చరిక పంపారు. ఈ స్ట్రైక్స్‌తో పారీకర్ పేరు ఒక్కసారిగా దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీన్ని జీర్ణించుకోలోని మోడీ.. ఆయనకు డిమోషన్ ఇచ్చి మళ్లీ గోవా సీఎంగా పంపారు.  
 
ఇపుడు వెంకయ్య నాయుడు విషయంలోనూ ఇదే జరిగింది. మోడీ మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రి. జీఎస్టీ వంటి బిల్లును ఆమోదించడంతో ఆయన చేసిన కృషి ఆమోఘం. పైగా, దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా మంచిపట్టున్న నేత. మంచి వాగ్ధాటి. బహుభాషాకోవిధుడు. మోడీ తర్వాత వెంకయ్యే అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. అంతే.. వెంకయ్యను మోడీ దెబ్బతీశారు. బలవంతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు పార్టీతో కూడా ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. తద్వారా వెంకయ్య కాళ్లు చేతులు కట్టేసి.. నోరు మూయించారు.
 
వీరేకాదు... వాజ్‌పేయి ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, నితిన్ గడ్కరీ వంటి వారు ఎక్కడున్నారో తెలియదు. రాజ్‌నాథ్ పేరుకే మోడీ మంత్రివర్గంలో హోం మంత్రి. కానీ, మోడీకి తెలియకుండా పిన్నీసును కూడా కదల్చలేని పరిస్థితి. ఇలా పార్టీలో ఉన్న సీనియర్ నేతలను ఏదోవిధంగా తనకు అడ్డు లేకుండా తొలగించుకుంటూ వస్తున్నారు. 
 
అంతేనా.. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులపై కూడా ఓ కన్నేసి ఉంచారు. తనకు పోటీగా ఎవరైనా వస్తున్నారంటే వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వ్యాపం స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరైపోయారు. అసలు విషయం తెలుసుకున్న చౌహాన్.. మిన్నకుండిపోయారు. ఇలా మోడీ వ్యూహాల ముందు ఎంతటి నేతలైనా చిత్తైపోతున్నారు. బొంగరంలా గింగరాలు తిరుగుతున్నారు. తన మంత్రివర్గంలోనే కాకుండా, బీజేపీలో కూడా వాజ్‌పేయి వాసనలంటూ లేకుండా చేస్తున్నారు. 
 
అంతేకాదండోయ్.. వాజ్‌పేయి కాలంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు ఎంతో గౌరవమర్యాదలు, ప్రాధాన్యత ఉండేది. కానీ, మోడీ హయాంలో అలాంటి పరిస్థితి లేదు. మిత్రపక్షాలకు కనీస మర్యాద కూడా ఎక్కడా కనిపించదు. అంతా మోడీ హవానే. 'బాహుబలి' చిత్రంలో రాజమాత శివగామి చెప్పినట్టుగా.. 'ఇదే నా మాట... నా మాటే శాసనం' అనే డైలాగ్‌కు తీసిపోని విధంగా ప్రధాని మోడీ నడుచుకుంటున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదనగా ఉంది.