శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:29 IST)

నా మనుమరాలి పెళ్లికి వచ్చింది ఈ నరేంద్ర మోడీయేనా? ఆహా... ఏమిటా వ్యూహచతురత? నవాజ్ షరీఫ్ అంతర్మథనం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు తలచుకుంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారట. తన మనుమరాలు మెహరున్నీసా వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఆ మోడీయేనా ఇపుడు తమపై కన్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు తలచుకుంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారట. తన మనుమరాలు మెహరున్నీసా వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఆ మోడీయేనా ఇపుడు తమపై కన్నెర్రజేసేది అంటూ తన సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నట్టు వినికిడి. 
 
నవాజ్ షరీఫ్ మనుమరాలు మెహరున్నీసాకు గత యేడాది డిసెంబరు నెలలో వివాహం జరిగింది. ఆ వివాహానికి ప్రధాని మోడీ హాజరై.. పాక్ నేతలతో పాటు... ప్రపంచ దేశాధినేతలకు సైతం షాక్ ఇచ్చారు. ఆసమయంలో షరీఫ్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా, స్నేహపూరితంగా నరేంద్ర మోడీ మెలిగారు. అలాంటి మోడీ యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై కన్నెర్రజేస్తున్నారు. 
 
ముఖ్యంగా యురీ దాడి తర్వాత ప్రధాని మోడీ పాకిస్థాన్ పట్ల గుర్రుగా ఉన్నారు. పాకిస్థాన్‌ను నలు వైపుల నుంచి ఒత్తితిడి తేవడంతో పాటు.. దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే, పాకిస్థాన్‌కు కల్పించిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ హోదాను కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. 
 
దీంతోపాటు అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేసే చర్యల్లో భాగంగా వచ్చే నవంబరు నెలలో ఇస్లామాబాద్ వేదికగా జరుగనున్న సార్క్ సదస్సుకు భారత్ గైర్హాజరు కావాలని భారత్ నిర్ణయించింది. దీంతో ఈ సదస్సును ఏకంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అదేవిధంగా కాశ్మీర్‌ అంశాన్ని పాక్‌ పదే పదే అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తుండటం, భారతలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తుండటంతో భారత వ్యూహాత్మకంగా బలూచిస్థాన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రధాని మోడీ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బలూచ్‌ ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతను ప్రస్తావించారు. దీంతో బలూచ్‌ ఉద్యమకారులకు కొత్త బలం లభించినట్లయింది. ఇది పాక్‌ పాలకులకు మింగుడుపడని అంశంగా మారింది. 
 
ఇకపోతే... ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వేదికగా పాక్‌ పేరు ఎత్తకుండానే ఆ దేశం దుర్మార్గాలను భారత దుమ్మెత్తిపోసింది. పాక్‌లాంటి ఉగ్రవాద దేశాలను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఐరాస సమావేశంలో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో పాక్‌ ఎంత గగ్గోలు పెట్టినా ఐక్యరాజ్య సమితిలో ఎవ్వరి నోటా కాశ్మీర్‌ మాట వినిపించకపోవడం పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బే. 
 
దీనికితోడు బలూచిస్థాన్‌లో పాక్‌ అక్రమాలను భారత ఎలుగెత్తి చాటడంతో ప్రపంచదేశాలు దానిపై దృష్టి సారించాయి. బలూచ్‌లో పాక్‌ అరాచకాల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈయూ ఉపాధ్యక్షుడు రిస్‌జార్డ్‌ జర్నెకి ఇటీవల ప్రకటించారు. ఇదే జరిగితే ఆర్థికంగా పాక్‌ ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. 
 
దీంతో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు నిద్రపట్టడంలేదు. నాడు తన ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి.. ఇప్పటి నరేంద్ర మోడీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు వినికిడి. అంతేనా.. మోడీకి దూకుడుకు కళ్లెం వేసేందుకు ఐక్యరాజ్య సమితిని వేదికగా ఎంచుకున్నప్పటికీ.. ఫలితం శూన్యంగా కనిపించింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. భారత్ శత్రుదేశంగా ఉన్న చైనాను దువ్వే పనిలో ఉన్నట్టు సమాచారం.