1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:20 IST)

తిరుమల శ్రీవారి ఖర్చులకు డబ్బుల్లేవు... రూ.కోట్లు ఏమైపోతున్నాయి?

ఒకప్పుడు తన వివాహం కోసం కుబేరుడి వద్ద అప్పు చేసిన శ్రీనివాసుడు. ఇప్పుడు ఆ కుబేరునికే అప్పు ఇవ్వగలిగినంత శ్రీమంతుడిగా అవతరించారు. కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారు.

ఒకప్పుడు తన వివాహం కోసం కుబేరుడి వద్ద అప్పు చేసిన శ్రీనివాసుడు. ఇప్పుడు ఆ కుబేరునికే అప్పు ఇవ్వగలిగినంత శ్రీమంతుడిగా అవతరించారు. కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారు. నిత్యం హుండీ ద్వారా కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు కానుకల రూపంలో వచ్చి పడుతూ అపారమైన సంపదతో తులతూగుతున్నారు. రూ.2,600 కోట్ల వార్షిక బడ్జెట్‌తో తితిదే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థగా విరాజిల్లుతోంది. 
 
ఏడు టన్నులకుపైగా బంగారు దాదాపు రూ.10 వేల కోట్ల నగదు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఏటా రూ.700 కోట్లకుపైగా వడ్డీనే సమకూరుతోంది. ఇలాంటి తితిదే రోజువారీ ఖర్చులకు ఇబ్బందిపడుతోంది. ఒక్కోసారి చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఇలా చెబితే ఆశ్చర్యంగానూ, నమ్మశక్యంగాని విధంగానూ ఉంటుంది. అయినా ఇది నిజం. ముమ్మాటికీ వాస్తవం. శ్రీవారికి వస్తున్న ఆదాయాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంలో తీసుకొచ్చిన మార్పు ఫలితంగా ఈ విచిత్ర పరిస్థితి తలెత్తింది.
 
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా ఉన్న తితిదేకి రోజువారి ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అన్నప్రసాదం, లడ్డూల తయారీ, పూజాసామగ్రి తదితరాల కొనుగోలు కోసమే తితిదే యేటా రూ.400 కోట్లు దాకా ఖర్చు చేస్తోంది. దీన్ని మార్కెటింగ్ విభాగం ఖర్చు చేస్తుంటుంది. ఈ విభాగంలో రోజుకు సగటున కోటి రూపాయలకుపైగా చెల్లింపులు ఉంటాయి. రవాణా, ఎస్వీ డెయిరీ ఫాం, ఆస్పత్రులు, ప్రెస్, గార్డెన్ తదితర విభాగాల్లో కొనుగోలు ఖర్చులు రూ.42 కోట్లకు పైమాటే. ఇక ఇంజనీరింగ్ బడ్జెట్ రూ.160 కోట్లు, మరమ్మత్తులు, మెయింటైన్స్ ఖర్చులు రూ.75 కోట్లు పైమాటే. 
 
మొత్తంగా రూ.235 కోట్లు ఖర్చవుతోంది. ఇక ఉద్యోగ కార్మికుల జీత భత్యాలకు రూ.643 కోట్లు వ్యయం అవుతుంది. విద్యుత్ ఛార్జీలు ఏటా రూ.55 కోట్లు చెల్లించాలి. ఇవన్నీ వివిధ పద్దుల ద్వారా ఈ చెల్లింపులన్నీ జరుగుతుంటాయి. ఉద్యోగుల జీతభత్యాలకు ఎక్కడా ఇబ్బంది రాలేదు గానీ కొనుగోళ్ళు ఇంజనీరింగ్ బిల్లుల చెల్లింపులో మాత్రం గత కొన్ని నెలలుగా నిధుల కొరత ఎదుర్కొంటున్న సమాచారం. బ్యాంకు ఖాతాల్లో తగినంత నిల్వలు లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు, సరఫరాదారుల ఒత్తిడి వల్ల బిల్లు పాస్ ఇచ్చేసినా బ్యాంకుల్లో చెల్లింపుల్లో మాత్రం ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదట. తితిదే చెక్కు ఇస్తే ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగిపోయేవి. 
 
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే కానుకలను క్యాపిటల్ రిషిట్స్ అంటారు. హుండీ ద్వారా వెయ్యి కోట్ల దాకా వస్తుంది. ఇందులో ఇంజనీరింగ్ పనులు, పెన్షన్ ఫండ్ తదితరాల కోసం రూ.300 కోట్లు దాకా ఖర్చు చేస్తారు. మిగతా డబ్బులను డిపాజిట్లుగా బ్యాంకుల్లో వేస్తారు. ఈ విధంగా ఇప్పటిదాకా రూ.10 వేల కోట్లు దాకా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపైన యేటా రూ.775 కోట్లకుపైగా వడ్డీ వస్తుంది. దీన్ని రెవిన్యూ ఆదాయం చూపుతారు. దర్శనాలు టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, తలనీలాల విక్రయం, గదులు, దుకాణాలు అద్దె తదితర ద్వారా వచ్చే ఆదాయం రెవెన్యూ ఆదాయమే. మొత్తంగా రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్ సరుకల కొనుగోలు, విద్యుత్ ఛార్జీలు వంటివి చెల్లిస్తారు. 
 
ఈ ఖర్చులు రూ.1600 కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడ తలెత్తిందంటే గతంలో పెట్టుబడులను యేడాది కాలపరిమితితో డిపాజిట్ చేసేవారు. యేడాదికి ఒకసారి రూ.775 కోట్ల దాకా వడ్డీ వచ్చి బ్యాంకుల్లో పడేది. అయితే గత యేడాది అన్ని డిపాజిట్లను మూడేళ్ళ కాలపరిమితితో బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీని వల్ల ఇప్పట్లో వడ్డీ రాదు. మూడేళ్ళ తర్వాతే వస్తుంది. అంటే ప్రస్తుత యేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా రూ.2 కోట్లు మాత్రమే వడ్డీగా వచ్చింది. అందుకే చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో హుండీ నుంచి వస్తున్న ఆదాయన్నే రోజువారి ఖర్చులకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆదాయానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు. సరుకుల సరఫరా చేస్తున్నావారికి పరిస్థితి వివరిస్తున్నారు. 
 
ఈ ఇబ్బంది తాత్కాలికమే.. డిపాజిట్ కాల పరిమితి ముగియగానే ఒకేసారి రూ.2 వేల కోట్లు వచ్చిపడతాయి. అప్పటి నుంచి చెల్లింపులకు ఇబ్బంది ఉండదు. ఎప్పటికప్పుడు పడిపోతున్న వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకుని 2015-16లోనే రూ.4 వేల కోట్లను దానిపై వచ్చే వడ్డీని ఒకేసారి మూడేళ్ళ కాలపరిమితికి డిపాజిట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇదేవిధంగా మూడేళ్ళ కాలానికే డిపాజిట్లు వేశారు. వడ్డీ రాబోదనే విషయాన్ని గత బడ్జెట్‌లో పత్రాల్లోనే పేర్కొన్నారు. లెక్కల కోసం రూ.775 కోట్లు వడ్డీ చూపించినా, ఆచరణలో ఆ డబ్బులు రాలేదు. అందువల్లే ప్రస్తుతం ఖర్చులకు కాస్త ఇబ్బందిగా మారింది.