1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (17:48 IST)

శ్రీరెడ్డి చెప్పిన ఫిగరే జనసేనకు వస్తుందా? పవన్ కల్యాణ్ షాకయ్యారా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుండటంతో రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్లుగా వ్యవహరించడానికి సిద్థమైపోతున్నాయి. ఇదే కోవలో తాజాగా జనసేన నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి ది

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుండటంతో రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్లుగా వ్యవహరించడానికి సిద్థమైపోతున్నాయి. ఇదే కోవలో తాజాగా జనసేన నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకాలం కమ్యూనిస్టు పార్టీలతోనే పొత్తులు పెట్టుకోవాలని భావించిన ఆయన తాజాగా వ్యూహం మార్చుకునే ఆలోచనలో పడినట్లు సమాచారం. 
 
అత్యంత విశ్వసనీయమైన సర్వే సంస్థతో చేయించిన తాజా సర్వేలో ఎపిలో జనసేన పార్టీకి చాలా తక్కువ అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయని తేలడంతో ఒక్కసారిగా షాకైంది జనసేన పార్టీ. శ్రీరెడ్డి ఇటీవల వ్యాఖ్యానిస్తున్నట్లుగా మరీ తక్కువ వస్తాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదిలావుంటే తమ పార్టీ కనీసం 30 స్థానాల్లో విజయం సాధించవచ్చని తద్వారా కర్ణాటక, జెడిఎస్ తరహాలో కింగ్ మేకర్ రోల్ పోషించవచ్చని భావించిన పవన్ కళ్యాణ్‌ సర్వే రిజల్టుతో ఆశ్చర్యపోవాల్సి వచ్చిందట. 
 
వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని పవన్ భావిస్తున్నట్తు తెలుస్తోంది. దీంతో ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తు లేకపోతే ఇబ్బందులు తప్పవని జనసేన ప్రధాన నాయకులు పవన్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ కూడా దానికి అంగీకరించినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నదానిపైనే సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ టిడిపి - బిజెపి కూటమికి బహిరంగంగానే సపోర్ట్ తెలిపారు. వారితో కలిసి సభలు, సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ళుగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూ వచ్చిన ఆయన ఎన్నికలకు యేడాది ఉన్న సమయంలో ఒక్కసారిగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో ఉరుము ఉరిమినట్లుగా చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ పైన అవినీతి ఆరోపణలు గుప్పించారు. 
 
ఒక్కసారిగా పవన్ విరుచుకుపడటంతో టిడిపి కూడా జనసేనపైన ఎదురుదాడి ప్రారంభించింది. అలా నాలుగేళ్ళుగా ఉన్న మిత్రులు కాస్త ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారిపోవాల్సి వచ్చింది. మరోవైపు వైసిపిపైన మొదటి నుంచి అంటీఅంటనట్లుగానే ఉన్నారు జనసేనాని. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ అవినీతి పైన ఆరోపణ అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. 
 
అయితే టిడిపితో బంధం విచ్చిన్నమైన తరువాత వైసిపితో పవన్ పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలు బలంగానే వినిపించాయి. జనసేనలో ప్రధాన నేతలు కూడా ఇందుకు సానుకూలంగానే ఉంటూ వచ్చారు. అయితే ఓ ప్రెస్ మీట్లో జగన్ అసందర్భంగా పవన్ కళ్యాణ్‌ పైన వ్యక్తిగత దూషణలు దిగడంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైసిపి - జనసేనల మధ్య ప్రస్తుతం కలవలేనంతగా అగాధం ఏర్పడిపోయింది. ఒకవేళ పొత్తులకు వెళ్ళే పరిస్థితి ఉంటే టిడిపి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. 
 
మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటం, తాజాగా చేసిన అంతర్గత సర్వేలో కూడా పొత్తులు లేకుంటే కష్టమని తేలడంతో తెలుగుదేశంతో బంధాలు కలుపుకునేందుకు మళ్ళీ జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాపులు వైసిపికి దూరం అయ్యారన్న అంచనా నేపథ్యంలో ఆ వర్గమంతా జనసేనకే మద్ధతిచ్చే అవకాశం ఉందన్న భావనలో ఉన్నారు పవన్ కళ్యాణ్‌. దీంతో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం అండతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పవన్ కళ్యాణ్‌‌కు ఉండటంతో కనీసం 30 స్థానాలు టిడిపి ఇస్తే ఆ పార్టీతో పొత్తులకు సై అనబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరి జనసేన ప్రతిపాదనకు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారుతోంది.