మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (15:14 IST)

151 సీట్లు వచ్చినా ఈ బానిసత్వం ఏంది రాజా?

ఏపీలో వైసీపీ పరిస్థితి జూలో సింహం లాగా తయారయ్యింది. సింహమే గానీ ఏం చేయలేని పరిస్థితి. 151 సీట్లు వచ్చినా, 22 ఎంపీ సీట్లు వచ్చినా నోరు మెదపలేని పరిస్థితిలో సీఎం ఉన్నారు. బలహీనంగా ఉన్న ప్రతిపక్షంపై ఆరోపణలు చేసి సంతృప్తి చెందడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. ఎందుకిలా... అంటే... స్విచ్ మోడీ చేతిలో ఉందని ప్రజలే చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఏ కారణం చేతనూ ఎదురుతిరిగే పరిస్థితి లేదు. 
 
అంతెందుకు కనీసం పదివేల ఓట్లు గెలవలేని కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు కూడా 151 సీట్లు సాధించిన వ్యక్తిని విమర్శిస్తుంటే... నిస్సహాయులుగా ఉండిపోతున్నారు వైసీపీ క్యాడర్. సీబీఐ కాంగ్రెస్ నేతలను సీనియర్లను కూడా అరెస్టు చేస్తోందనీ, ప్రధాని మోడీకి నచ్చని వారిపై సీబీఐ దాడులు చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 
 
అందుకేనేమో ఎందుకొచ్చిన గోల అని కేవలం సైలెంట్‌గా ఉంటూ జయహో మోడీ అనడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి. అదేంటి... బ్రహ్మాండంగా తనకిష్టమొచ్చిన వారికి పదవులు ఇస్తుంటే... ఐదుగురు డిప్యూటీ సీఎంలను పెడితే... ఇంకా ఏం కావాలి అంటున్నారా?
 
జగన్ ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారా?
 
1. పోలవరం గురించి తన పరిధిలో ప్రయత్నాలు చేయడం మినహా కేంద్రాన్ని ఏ డిమాండ్ చేయలేదు.
 
2. గత బడ్జెట్లో రాష్ట్రానికి కేవలం 22 కోట్లు ఇచ్చారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతితక్కువ కేటాయింపు. అయినా ఒక్క విమర్శ చేయలేదు.
 
3. రాజధానికి నిధులు అడిగే ధైర్యం లేదు. కనీసం వరద సాయం అడిగే పరిస్థితి లేదు.
 
4. కేంద్రం కేటాయించిన ఇళ్లలో దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించింది. ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి లేదు. 
 
5. పోర్టుల గురించి ప్రశ్నించలేదు.
 
6. విభజన చట్టంలో కేటాయించిన విద్యా సంస్థల బిల్డింగులకు ఇప్పటివరకు 10 శాతం నిధులే ఇచ్చారు. మిగతా 90 శాతం నిధులను అడగనే లేదు.
 
7. ఇక ప్రత్యేక హోదా తన ఊపిరి అని చెప్పి... ’’ఇంకేం చేద్దాం.. రిక్వెస్ట్ చేద్దాం‘‘ అన్నారు. ఆ పనీ చేయలేదు. 
 
ఇలా కేంద్రాన్ని ఏమీ అడగలేని, నిలదీయలేని, ప్రశ్నించలేని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మోడీ, అమిత్ షాలకు చెప్పకుండా ఏమీ చేయం... అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
 
కేంద్రాన్ని నిలదీయడం పక్కనపెడితే... ఏపీలో టికానా లేని నేతల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చుకోలేక సతమతం అవుతోంది వైసీపీ క్యాడర్. ఏపీ ప్రజలు ఉహించని భారీ మోజార్టీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని చెబితే... ఆ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తు, ఆ మెజారిటీకి విలువే లేకుండా చేశారు అని సామాన్యులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 
 
గత ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే... దాని అర్థమేంటి? నువ్వు ఏం చేస్తావో చేసి చూపు, గత ప్రభుత్వం చేసింది మాకు నచ్చక నీకు అనుకూలంగా తీర్పు ఇచ్చాం అని. కానీ ఆ పనీ చేయడం లేదు అని ప్రజలు భావిస్తున్నారు. ఈ భావన ప్రజలమనసులో ప్రబలమైందంటే... జగన్ పుట్టి మునగడం ఖాయం....ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారో చూడాలి.