శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (14:47 IST)

నాడు షరీఫ్ తల్లికి పాదాభివందనం... నేడు నల్లకుబేరులపై పంజా.. మోడీ టఫ్‌ మాస్టర్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజా విసిరారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై ఆయన ఉక్కుపాదం మోపారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ కేంద్రంగా చేసుకుని కాశ్మీర్‌తో పాటు.. దేశంలో విధ్వంసాలకు తెగబడుతున్న ఉగ్రవాదులపై ని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజా విసిరారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై ఆయన ఉక్కుపాదం మోపారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ కేంద్రంగా చేసుకుని కాశ్మీర్‌తో పాటు.. దేశంలో విధ్వంసాలకు తెగబడుతున్న ఉగ్రవాదులపై నియంత్రణ రేఖ దాటి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపారు. అలాగే, కాలికి బలపం కట్టుకుని ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌లో దేశానికి చోటుదక్కేలా చేశారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఇలా గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇప్పటిదాకా వచ్చిన ప్రధానులతో పోలిస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కొంచెం భిన్నంగా పాలన సాగిస్తున్నారు. 
 
దేశ దశను దిశను మార్చే పలు క్లిష్టమైన నిర్ణయాలను ఆయన కేవలం రెండున్నరేళ్లలో తీసుకోవడం గమనార్హం. భారత అంటే ఒకప్పుడు మెతక దేశంగా భావించే చాలా దేశాల్లో ఇప్పుడు భారత్‌కు ఒక గౌరవం ఉందంటే అది మోడీ చలవేనంటే అతిశయోక్తి కాదు. ఉగ్రవాదంపై ఏ ఒక్కరి సమస్యో కాదని.. అది ప్రపంచ దేశాలన్నిటికీ సమస్యేనని పదేపదే అంతర్జాతీయ వేదికలపై పునరుద్ఘాటిస్తున్నారు. తద్వారా అంతర్జాతీయంగా కదలికను తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు. 
 
అలాగే అమెరికాతో ‘అణు’బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. అదేసమయంలో అటు పాత మిత్రుడు రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పాక్‌తో సత్సంబంధాలకు తొలుత ఎంతగానో కృషి చేశారు. ఆఫ్గనిస్థాన్‌కు వెళ్లి తిరిగి వస్తూ అనూహ్యంగా పాక్‌లో దిగి.. నవాజ్‌ షరీఫ్‌ తల్లికి ప్రణమిల్లి తన సహృదయతను చాటుకొన్నారు. కానీ పాక్‌ తన నైజాన్ని మార్చుకోకపోవడంతో కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను పరోక్షంగా ధ్వజమెత్తుతూ ఆ దేశాన్ని దాదాపుగా ఒంటరి చేయగలిగారు.