శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (13:38 IST)

తెలంగాణ 'బంగారు తెలంగాణ' కావాలి... మోదీ: మరి ఏపీ ప్రత్యేక హోదా ఏం కావాలీ...?!!

ఏపీ విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా మారిపోయిన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి

ఏపీ విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా మారిపోయిన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ... తను కూడా ఆ కల సాకారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
తెలంగాణ చేస్తున్న ప్రతి పనిలోనూ కేంద్రం వెన్నంటే ఉంటుందనీ, అవసరమైన నిధులను సమకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఎందుకు ఏర్పడిందో... ఏం కావాలని రాష్ట్ర విభజన జరిగిందో అవన్నీ సాధించాలని తను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకువచ్చి వారికి మేలు చేయాలని సీఎం కేసీఆర్ తన వద్దకు వచ్చినపుడల్లా చెప్తుండేవారనీ, అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు నరేంద్ర మోదీ. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ ఎంతో ఉద్వేగంతో ఉండేవారనీ, అవన్నీ ఆయన క్రమంగా సఫలం చేస్తూ వస్తున్నారన్నారు. 
 
అలాగే విద్యుత్ సమస్య నుంచి ఇపుడు తెలంగాణ గట్టున పడటానికి తాము తెచ్చిన సంస్కరణలు కారణమన్నారు. గతంలో ఒక యూనిట్ 11 రూపాయలు వెచ్చించాల్సి వచ్చేదనీ, ఇపుడు కేవలం రూ.1.45 మాత్రమే చెల్లించే పరిస్థితిని తీసుకొచ్చామన్నారు. మొత్తమ్మీద తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం మద్దతుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ చెప్పారు. కాగా ఏపీ ప్రత్యేక హోదా పైన మాత్రం ఇప్పటివరకూ ఆయన బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి హోదాపై ఆయన ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొని ఉంది. అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చిక్కులు ఉన్నాయంటూ చెప్పిన సంగతి తెలిసిందే.